చెరువులపై నిఘా.. 15 బృందాలతో నిరంతర పర్యవేక్షణ
ఇంకా భారీ వర్షాలున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి
గండ్లు పడినా, కట్టలు తెగినా తక్షణమే మరమ్మతులు
ముంపు ప్రాంతాల ప్రజలనూ అప్రమత్తం చేయండి
జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆ దేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నగరంలోని అన్ని చెరువులను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్తో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసాయన్నారు. దీని కారణంగానే నగరంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరిందన్నారు. నగరంలోని వరద నీటితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చెరువుల ద్వారా కూడా చాలా నీరు హైదరాబాద్ నగరంలోని చెరువుల్లోకి వచ్చిందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఫలితంగా నగరంలోని చెరువులన్నీ పూర్తి గా నిండిపోయాయన్నారు. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువులన్నీ నిండిపోయి ఉండడంతో పాటు ఇంకా వరద నీరు వస్తున్నందున కట్టలకు గండి పడడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సూచించారు. కాబట్టి నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని, కట్టల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఎక్కడైనా గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మత్తులు చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్న చోట, గండ్లు పడే అవకాశం ఉన్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను సైతం అగమేఘాలపై అప్రమత్తం చేయాలన్నారు. వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అని సిఎం కెసిఆర్ ఆదేశించారు.
Authorities Should be Alert on Rains: CM KCR