Saturday, May 4, 2024

100% మనవే

- Advertisement -
- Advertisement -
వందశాతం మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే
రాష్ట్ర అవతరణ తరువాత ఏర్పాటయిన కాలేజీల్లోనూ కన్వీనర్ కోటా సీట్లకు వర్తింపు
నిబంధనలను సవరించిన రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే ఎంబిబిఎస్ బి కేటగిరిలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వేషన్ అమలు
వైద్యరంగంలో మరో మైలురాయి
దేశం మొత్తం ఎంబిబిఎస్ సీట్లలో 43శాతం మనవే : మంత్రి హరీశ్‌రావు హర్షం

మనతెలంగాణ/హైదరాబాద్ : వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చే సింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్, ఆర్టికల్ 371డి నిబంధనలకు లోబడి అ డ్మిషన్ రూల్స్‌కు సవరణ చేశారు. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏ ర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటా(కన్వీనర్ కోటా)లోని 100 శాతం మెడికల్ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చే యాల్సి ఉంటుంది.అంతకుముందు 85 శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా,మిగతా 15శాతం సీట్లు అన్ రిజర్వుడుగా ఉండేవి. ఆ సీట్ల కు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా సవరణ వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబిబిఎస్ సీట్లు దక్కనున్నాయి. కాగా, తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలను చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. నాడు తెలంగాణలో 2,850 ఎంబిబిఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు సీట్ల సంఖ్య 8,340కు పెరిగింది.
పాత 20 మెడికల్ కాలేజీలకే అన్ రిజర్వ్‌డ్ కోటా పరిమితం
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా(కన్వీనర్ కోటా) కింద 1,895 సీట్లు ఉండేవి. అందులో 15 శాతం అన్ రిజర్వుడు కోటాగా 280 సీట్లను కేటాయించాల్సి వచ్చేది. అయితే అన్ రిజర్వుడు కోటాలో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా సీట్లు పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ఇదే విధానం కొనసాగితే పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15 శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దాంతో మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలను సవరించింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా ప్రభుత్వం తాజా సవరణ చేసింది. దీంతో తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభించనున్నాయి. ఇప్పటికే ఎంబిబిఎస్ బి కేటగిరి సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబిబిఎస్ సీట్లు పెరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 1,820 సీట్లు అదనంగా ప్రతి ఏటా దక్కనున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోట 15 శాతం సీట్లు యధాతథంగా ఉంటాయి. వాటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు.
వైద్య రంగంలో తెలంగాణ మరో మైలురాయి: మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలో వైద్యారోగ్యాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ మెడికల్ కాలేజీలు పెరిగాయి. దీంతో ఎంబిబిఎస్ సీట్ల పెంపులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక మైలురాయిని అందుకుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిధిలో 2023 -24 విద్యా సంవత్సరానికిగానూ దేశంలో అందుబాటులోకి వచ్చిన మొత్తం మెడికల్ సీట్లలో 43 శాతం సీట్లు తెలంగాణ నుంచి అందుబాటులోకి వచ్చినవే అని మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన 2,118 ఎంబిబిఎస్ సీట్లలో 900 సీట్లు తెలంగాణ నుండి వచ్చినవే అని తెలిపారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, వైద్య విద్యను ప్రజలకు మరింత చేరువ చేసి ఆరోగ్య తెలంగాణ సాకారం చేయాలన్నదే సిఎం కెసిఆర్ సంకల్పం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మిగతా మెడికల్ కాలేజీలకు అనుమతులు వస్తే సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News