న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి గరీబు కళ్యాణ్ రోజ్గార్ యోజన లక్షాల సాధనకు నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసింది. దాదాపు 116 మంది సీనియర్ బ్యూరోక్రాట్లకు ఈ బాధ్యత అప్పగిస్తూ నియామకాలు జరిపారు. వలసకూలీలను ఆదుకునేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో కరోనా ప్రభావంతో వలస కూలీలు ఉపాధి పోగొట్టుకున్నారు. వేలాది మంది వారి వారి స్వస్థలాలకు అతి కష్టం మీద వెళ్లాల్సి వచ్చింది. వీరికి తగు విధమైన ఉపాధి గ్రామీణ ప్రాంతాలలో ప్రజా పనులను సమన్వయపర్చుకునే రీతిలో ఈ పథకాన్ని రూపొందించారు. దీనిని క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు చేయడం నోడల్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ వంటి వివిధ సర్వీసులకు చెందిన సంయుక్తకార్యదర్శుల స్థాయి అధికారులను ఎంపిక చేసి, వారిని ఈ యోజన నోడల్ అధికారులుగా నియమించారని అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
ప్రస్తుత దశలో ఆయా అధికారులు తమ బాధ్యతలను వీడియో కాన్ఫరెన్స్లు, డిజిటల్ మ్యాప్ల ద్వారా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను నోడల్ అధికారులు గ్రామీణాభివృద్ధి విభాగం నుంచి పొందుతూ, బాధ్యతలను నిర్థారించుకోవల్సి ఉంటుందని కేంద్ర సిబ్బంది, ఉద్యోగుల మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది.స్వస్థలాలకు చేరుకున్న వలసకూలీలకు తగు విధంగా పనులను కల్పించే కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. నోడల్ ఆఫీస్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లతో సమన్వయం చేసుకుంటూ అభియాన్ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గరీబు కళ్యాణ్ యోజన పరిధిలో చేపట్టే ప్రజా పనులు మొత్తం మీద రూ 50వేల కోట్ల వ్యయ అంచనాలతో విస్తరించుకుని ఉన్నందున వేలాది మంది ఊరికి వెళ్లిన కూలీలకు తగు విధమైన ఉపాధి దక్కుతుందని కేంద్రం భరోసా కల్పిస్తోంది.