న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు 4 లక్షలకు చేరువయ్యాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 14,516 కొత్త కోవిడ్-19 కేసులు, 375 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కోవిడ్ కేసులు 3లక్షల 95,048 చేరుకున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 12,948 మంది ప్రాణాలు విడిచారు. ఇండియాలో 2,13,830 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,68,269 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో ఇన్ని కేసులు పెరగడం ఇదే తొలిసారి. అటు మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆగడం లేదు. లక్షా 24,331 మందికి కోవిడ్ సోకింది. 5,893మంది కరోనాతో మృతి చెందారు. తమిళనాడులో మొత్తం 54,449 మంది కరోనా బారిన పడగా… 666 మరణాలు సంభవించాయి. దేశరాజధాని ఢిల్లీలో 53,116 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 2,035 మందిని కరోనా కబలించింది. గుజరాత్ లో 26,141 కోవిడ్ కేసులు.. 1,681 కరోనా మరణాలు నమోదయ్యాయి. కర్నాటకలో కరోనా కేసులు పదివేలకు చేరువలో ఉన్నాయి.