ఎపిలో 4 సీట్లు వైకాపాకే
న్యూఢిల్లీ: 8 రాష్ట్రాల్లో 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం ఫలితాలు వెల్లడయ్యాయి. బిజెపికి 8, కాంగ్రెస్కు4, వైఎస్ఆర్సిపికి 4, ఇతరులకు మూడు స్థానాలు లభించాయి. రాజ్యసభకు ఎన్నికైన వారిలో దిగ్విజయ్సింగ్(కాంగ్రెస్), జ్యోతిరాధిత్య సింధియా(బిజెపి), శిబూసోరెన్(జెఎంఎం) ఉన్నారు. గుజరాత్లో మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగగా.. బిజెపికి మూడు, కాంగ్రెస్కు ఒక స్థానం లభించాయి. మధ్యప్రదేశ్లో బిజెపికి రెండు, కాంగ్రెస్కు ఒక స్థానం లభించాయి. రాజస్థాన్లో కాంగ్రెస్కు రెండు, బిజెపికి ఒక స్థానం లభించింది. జార్ఖండ్లో జెఎంఎంకు ఒకటి, బిజెపికి ఒక స్థానం లభించాయి.
మేఘాలయలో ఎన్పిపికి ఒకటి, మిజోరంలో ఎంఎన్ఎఫ్కు ఒక స్థానం,మణిపూర్లో బిజెపికి ఒకటి లభించాయి. ఆంధ్రప్రదేశ్లో నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా మొత్తం వైఎస్ఆర్సిపికే దక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున బరిలో దిగిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. టిడిపి తరఫున బరిలో దిగిన వర్ల రామయ్యకు నిరాశ తప్పలేదు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ శుక్రవారం వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగింది.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. కాగా ఈ ఎన్నికలలో 173 మంది ఎంఎల్ఎలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఇఎస్ఐ శ్కాం నిందితుడు టిడిపికి చెందిన టెక్కలి ఎంఎల్ఎ అచ్చెన్నాయుడికి ఓటు వేసేందుకు అనుమతి లభించలేదు. అలాగే రేపల్లె టిడిపి ఎంఎల్ఎ అనగాని సత్యప్రసాద్ హోమ్ క్వారంటైన్లో ఉండటం కారణంగా ఓటింగ్కు దూరంగా ఉన్నారు.