చైనాలో కూలిన రెస్టారెంట్.. 29 మంది దుర్మరణం
80 ఏండ్ల వృద్ధుడి బర్త్డే, పలువురి సజీవ సమాధి
బీజింగ్: చైనాలో ఓ రెస్టారెంట్ కుప్పకూలిన దుర్ఘటనలో కనీసం 29 మంది మృతి చెందగా.. మరో 28 మంది గాయపడ్డారు. ఓ వ్యక్తి 80వ జన్మదిన వేడుక జరుగుతుండగా, అంతా కేరింతలు కొడుతూ ఉండగా రెస్టారెంటు కూలింది. ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రాంతంలో ఈ విషాద ఘటన జరిగిందని అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం బర్త్డేకు ఈ వృద్ధుడి బంధువులు, ఆయన గ్రామస్తులు తరలివచ్చారు. చెంజూయాంగ్ గ్రామంలోని జుక్సియన్ రెస్టారెంట్లో సంబరాలు మిన్నంటినప్పుడే ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజాము వరకూ సహాయక కార్యక్రమాలు జరిగాయి. శిథిలాల నుంచి గాయపడ్డ వారిని, మృతులను అతికష్టం మీద బయటకు తీశారు. మొత్తం 57 మందిని శిథిలాల నుంచి వెలికితీశారు. రెండు అంతస్తుల రెస్టారెంట్ ఈ మానవ విషాదానికి కారణం అయింది.
మొత్తం 29 మంది మృతి చెందినట్లు నిర్థారించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడగా, 21 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారని అధికారిక వార్తాసంస్థ జిన్హూవా తెలిపింది. ఈ సంఘటనపై వర్క్ సేఫ్టీ కమిటీ తక్షణ దర్యాప్తు చేపట్టింది. రెస్టారెంట్ ఏ విధంగా కూలిందనేది ప్రజలకు దర్యాప్తు క్రమంలో తెలియచేస్తామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా చైనాలో అత్యంత అధునాతన రెస్టారెంట్లు వెలిశాయి. చైనాలో పారిశ్రామిక భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా వ్యవహరిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఈ నిబంధనలను పాటించడం లేదని, చాలా వరకూ రెస్టారెంట్లు, అతిథి గృహాలు వీటిని పట్టించుకోవడం లేదని స్పష్టం అయింది. ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి కోలుకుంటున్న చైనాలో చాలా రోజులుగా ఎక్కడబడితే అక్కడ పార్టీలూ, సామూహిక విందులూ వినోదాలు జరుగుతూనే ఉన్నాయి.
29 died after Restaurant collapsed in China