మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ముగ్గురు నిందితులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు, రూ.8,85,000 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… వరంగల్ జిల్లాకు చెందిన అరండ్కర్ రాజ్కుమార్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ములుగులో సూపరింటెండెంట్గా పనిచేశాడు, ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాడు.
వికారాబాద్ జిల్లా, తాండూర్కు చెందిన అరోర్ వీరమణి హౌస్వైఫ్, వికారాబాద్ జిల్లాకు చెందిన చిచెంటి పాండు నగరంలోని బడంగ్పేటలో ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ముగ్గురు కలిసి తమకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు తెలుసని వారితో మాట్లాడి జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. ఇలా 25మంది నిరుద్యోగుల జిరాక్స్ సర్టిఫికేట్లు తీసుకున్నారు, ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 నుంచి రూ.10లక్షలు తీసుకున్నారు. ఇలా 25మంది అభ్యర్థుల నుంచి రూ.1,27,00,000 తీసుకున్నారు. అభ్యర్థులను ప్రధాన నిందితుడు రాజ్కుమార్ హైదరాబాద్లోని పంచాయతీ డిపార్ట్మెంట్కు తీసుకుని వెళ్లి వారిని నమ్మించాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితులు నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు తయారు చేసి అభ్యర్థులకు ఇచ్చారు.
3 persons arrested in cheating people in Hyderabad