Friday, May 3, 2024

ఒక్కరోజే 70 విమాన సర్వీసులు రద్దు: విస్తారాను నివేదిక కోరిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/ముంబై : విస్తారా సంస్థకు చెందిన విమానాల రద్దు, ఆలస్యాలపై రోజువారీ పూర్తి నివేదికను అందజేయాలని కేంద్ర విమానయాన నిఘా సంస్థ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిజిసిఎ) విస్తారా సంస్థను మంగళవారం ఆదేశించింది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విమానాలను నడుపుతున్న విస్తారా సంస్థ గత వారం విమానాల సర్వీస్‌లను ఆలస్యం చేయడంతోపాటు కొన్ని సర్వీసులను కూడా రద్దు చేసింది. దీనికి ముఖ్య కారణం పైలట్ల కొరత. ఫలితంగా దాదాపు 50 విమానసర్వీసులు రద్దు అయ్యాయి. మరో 160 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సంస్థ విమానసర్వీస్‌లకు ఈ పరిస్థితి రావడానికి కారణం విస్తారా సంస్థను ఎయర్ ఇండియాతో విలీనం చేయడానికి జరుగుతున్న ప్రక్రియ. చాలా మంది నిరసనగా తాము సిక్ అయ్యామని విధులకు గైరుహాజరవుతున్నారు.

ఎయిర్ ఇండియాలో విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించాలని పైలట్లు డిమాండ్ చేస్తున్నారు. దీని ఫలితంగా సోమవారం 50 విమానాలను విస్తారా రద్దు చేసింది. దీంతో మంగళవారం నాటికి ఈ సమస్య మరింత జటిలమయ్యింది. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో దాదాపు 70 కి పైగా సర్వీస్‌లను రద్దు చేయవలసి వచ్చింది. ముంబై, ఢిల్లీ , బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన సర్వీసులు రద్దు అయ్యాయి. మరో 160 సర్వీస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విస్తారా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించింది.

విస్తారా నెట్‌వర్క్ అంతటా తగిన కనెక్టివిటీని నిర్ధారించేందుకు విమానాల సర్వీస్‌లను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్టు పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎంపిక చేసిన దేశీయ రూట్లలో బీ 7879 డ్రీమ్‌లైనర్, ఏ 321నియోవంటి లార్డ్ ఎయిర్ క్రాప్ట్‌లను కూడా వినియోగించినట్టు వెల్లడించింది. ఇబ్బందులు పడిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా తిరిగి ప్రయాణ ఛార్జీలు చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు వివరించింది. విస్తారాకు దాదాపు 70 విమానాలు ఉన్నాయి. మార్చి 31 నుంచి సమ్మర్ షెడ్యూల్ ప్రారంభమైనందున, ఈ సంస్థ రోజూ దాదాపు 300 విమానసర్వీస్‌లను నడపాల్సి ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News