Sunday, April 28, 2024

మార్చి నాటికి 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది రూ. 40 వేల కోట్ల టర్నోవర్, రూ.3500 కోట్ల లాభాలు సుసాధ్యం
తొలి అర్ధ సంవత్సరంలో బొగ్గు రవాణాలో12 శాతం, ఉత్పత్తి లో 7 శాతం,
ఓబీ తొలగింపులో 15 శాతం వృద్ధి
ఇక నుంచి రోజుకు 2.1 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలి
రోజూ 14.65 లక్షల క్యూబిక్ మీటర్ల ఓర్డెన్ తొలగింపు లక్ష్యం
అన్ని ఏరియాల జిఎంలకు చైర్మన్, ఎండి ఎన్. శ్రీధర్ దిశా నిర్దేశం

మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలంలో రోజుకు కనీసం 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి ,రవాణా జరపాలని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండి ఎన్. శ్రీధర్ పేర్కొన్నారు. తద్వారా మార్చి నెల చివరికల్లా 720 లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని దాటాలని పిలుపునిచ్చారు. మంగళవారం సింగరేణి భవన్ నుండి ఆయన సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి పై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరునెలల కాలంలో వర్షాల వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ , అన్ని రకాల అవరోధాలను అధిగమిస్తూ గత ఏడాది బొగ్గు రవాణాలో 12 శాతం వృద్ధిని, బొగ్గు ఉత్పత్తిలో 7 శాతం వృద్ధిని, ఓవర్ బర్డెన్ తొలగింపులో దాదాపు 15 శాతం వృద్ధిని సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న ఆరు నెలల కాలం ఎంతో కీలకమైంది. బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ వస్తోందని అన్ని ఏరియాలకు అవసరమైన యంత్రాలు అనుమతులు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చినట్లు తెలిపారు. ఇక నుంచి వర్ష ప్రభావం కూడా ఉండే అవకాశం లేదని రానున్న వారం రోజుల్లోగా ఓపెన్ కాస్ట్ క్వారీలలో ఇంకా నిలిచి ఉన్న నీటిని బయటకు తోడి పోసి, బొగ్గు ఉత్పత్తిని, ఓవర్ బర్డెన్ తొలగింపును ఇచ్చిన లక్ష్యాల మేర విధిగా సాధించాలని , దీనికోసం ఏరియా స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు పోవాలని జీఎంలను ఆదేశించారు.
అన్ని ఏరియాలు తమకు ఇచ్చిన లక్ష్యాలు సాధిస్తే ఈ ఏడాది నిర్దేశిత 720 లక్షల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి ,రవాణా చేసే అవకాశం ఉందన్నారు. తద్వారా రూ.40 వేల కోట్ల టర్నోవర్, సుమారు రూ. 3500 కోట్ల రూపాయల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు.

సింగరేణి ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే దఫా రూ 1750 కోట్ల రూపాయల వేజ్ బోర్డు ఏరియర్సు చెల్లించామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా 32 శాతం లాభాల బోనస్ మొత్తం రూ. 711 కోట్ల రూపాయలను కూడా దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత దీపావళి బోనస్ ను కూడా ఆ పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కనుక కంపెనీపై విశ్వాసంతో, విధుల పట్ల అంకితభావంతో కార్మిక ,అధికార శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని, తద్వారా గత ఏడాది కన్నా మిన్నగా లాభాలు పొందే అవకాశం ఉందన్నారు.

తొలి అర్థ సంవత్సరంలో లక్ష్యాలను దాటిన సింగరేణి
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెల నుండి సెప్టెంబర్ మాసాంతానికి గల అర్ధ సంవత్సరంలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాలో నిర్దేశిత లక్ష్యాలను సాధించింది ఈ అర్థ సంవత్సరానికి బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా సింగరేణి ఈ లక్ష్యాన్ని దాటి 330 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపి 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలానికి సాధించిన బొగ్గు రవాణా (294 లక్షల టన్నులు)తో పోల్చి చూస్తే ఇది 12 శాతం అధికం. అలాగే ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సర బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 314 లక్షల టన్నులను సాధించి నూరు శాతం లక్ష్యసాధన తో నిలిచింది. గత ఏడాది ఇదే కాలానికి సాధించిన బొగ్గు ఉత్పత్తి (292 లక్షల టన్నులు)తో పోల్చి చూస్తే 7.15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. కాగా ఓవర్ బర్డెన్ తొలగింపులో గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సాధించిన 171.30 లక్షల క్యూబిక్ మీటర్ల కన్న మిన్నగా ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 14.84 శాతం వృద్ధితో 196.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను సింగరేణి సంస్థ సాధించింది.

ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎన్.బలరామ్ (పర్సనల్, ఫైనాన్స్), డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎన్ వి కె శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి వెంకటేశ్వర్ రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్), అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జి.ఆల్విన్, జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) ఎం.సురేష్, జీఎం(సీపీపీ) జక్కం రమేష్, జీఎం(ఎంపీ) మల్లెల సుబ్బారావు, జీఎం(మార్కెటింగ్) జి.దేవేందర్, జీఎం(సీఎంసీ) మోహన్ రెడ్డి , కార్పొరేట్ కు చెందిన వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News