న్యూఢిల్లీ: రానున్న ఆరు నెలల్లో దేశంలోని యువజనులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో చితకబాదుతారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. దేశాన్ని షహీన్బాగ్(సిఎఎకు వ్యతిరేకంగా గడచిన రెండు నెలలకు పైగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న ప్రదేశం)గా మార్చేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని బిజెపి గురువారం ఆరోపించింది. బుధవారం ఢిల్లీలో ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ దేశంలో ప్రస్తుతం నెలకొన్న నిరుద్యోగ సమస్యను ప్రస్తావించారు. రానున్న కాలంలో ప్రధాని మోడీ ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుందని, యువజనులకు ఉద్యోగాలు కల్పించకుండా దేశం అభివృద్ధి సాధించలేదని తెలియచెప్పేందుకు ప్రధాని మోడీని వారు కర్రలతో చితక బాదుతారని రాహుల్ విమర్శించారు.
అనంతరం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీల లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు ఎటువంటి చర్యలను ప్రకటించలేదని విమర్శించారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ సమస్య దేశంలో ఏర్పడిందని, ప్రధాని మోడీ కాని నిర్మలా సీతారామన్ కాని దీని పరిష్కారానికి ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి యువజనుడు ఉద్యోగం గురించి ప్రశ్నిస్తున్నాడని, ఇది వాస్తవమని ఆయన అన్నారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. ఈ దేశాన్ని షహీన్బాగ్లా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. షహీన్బాగ్ నిరసనకారుల భుజాలపైన రాజకీయ తుపాకులు పెట్టి తమను కాల్చడానికి ప్రయత్నిస్తున్నారని నఖ్వీ వ్యాఖ్యానించారు.