హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో తొలి నాలుగు వరుసల రైలు మార్గం సిద్ధమైంది. మౌలాలి-ఘట్కేసర్ స్టేషన్ల మధ్య ప్రస్తుతం అందుబాటులో ఉన్న డబుల్ లైన్ మార్గానికి అదనంగా12.2కిమీటర్ల పొడవుగల మరో డబుల్ లైన్ విద్యుదీకరణ, ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు రైళ్ళను నడపడానికి సిద్ధమైంది. ఎంఎంటిఎస్ ఫేస్2 ప్రాజెక్టులో భాగంగా నాలుగు వరుసల రైలు మార్గం నిర్మాణానికి రూ.200 కోట్ల నిధులు వ్యయం చేశారు. రైల్వే స్టేఫ్టి విభాగం నూతన నాలుగు లైన్ల మార్గం ప్రయాణానికి అనువైందిగా నిర్ధారిస్తూ అనుమతి మంజూరు చేసింది. మౌలాలి-ఘట్కేసర్ సెక్షన్ రైలు మార్గం రైళ్ల రద్ది నివారణకు క్రియాశీలమైన భూమిక వహిస్తుంది.
సికింద్రాబాద్, కాజీపేట్, నడికుడి, సనత్నగర్ రైల్వేస్టేషన్లను అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో రైళ్ళ రద్దీ తగ్గించడంతో పాటు సబర్బన్ రైళ్ళను నిర్వహించడానికి నాలుగు లైన్ల మార్గంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ మేరకు చర్లపల్లి, ఘట్కేసర్ స్టేషన్లో రెండు అదనపు ఫ్లాట్ ఫారాలను కూడా నిర్మించడం జరిగింది. అలాగే మౌలాలి సిక్యాబిన్, చర్లపల్లి, ఘట్కేసర్ స్టేషన్ల వద్ద నూతనంగా స్టేషన్ భవనాలను నిర్మించారు. ఈ ప్రాజెక్టు జంట నగరాల తూర్పు ప్రాంతాల నుండి హైటెక్ సిటి, లింగంపల్లి, పటాన్ చెరువు, ఫలక్నూమా తదితర ప్రాంతాలకు చేరుకోవడానికి సౌకర్యవంతమైందిగా ఉంటుందని రైల్వే అధికారులు వివరించారు.