న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్ ఇప్పటికే ముగిసి పోయిందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక్కడ ఓ స్పోర్ట్ స్టోర్ను ప్రారంభించిన సెహ్వాగ్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ధోనీ కెరీర్పై అడిగిన ఓ ప్రశ్నకు ఈ విధంగా స్పందించాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ అంతర్జాతీయ కెరీర్ అనాధికరికంగా ముగిసి పోయిందన్నాడు. తిరిగి టీమిండియాలో చోటు సంపాదించే అవకాశాలు దాదాపు లేవని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్ వంటి యువ క్రికెటర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో వెటరన్ ఆటగాడు ధోనీకి తీరిగి భారత జట్టులో చోటు లభిస్తుందని తాను భావించడం లేదన్నాడు.
గతంతో పోల్చితే ధోనీ ఆటలో జోష్ తగ్గిందని, కీపింగ్లోనూ అతను వైఫల్యాలు చవిచూస్తున్నడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ తిరిగి జాతీయ లోకి రావడం దాదాపు అసాధ్యమేనన్నాడు. కరోనా వ్యాధి త్వరలోనే అదుపులోకి వస్తుందనే నమ్మకాన్ని సెహ్వాగ్ వ్యక్తం చేశాడు. రద్దయిన టోర్నీలన్నీ మళ్లీ తిరిగి ప్రారంభం కావడం ఖాయమన్నాడు. ఇక, కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని ఈ వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు.