బాలీవుడ్లో ప్రేమ వ్యవహారాలు నిరంతరం హాట్ టాపిక్. అక్కడ ఆదర్శంగా నిలిచే ప్రేమలు చాలా అరుదు. ప్రేమ, పెళ్లి లాంటి విలువలు అక్కడ అవసరాన్ని బట్టి మారిపోతుంటాయి. తాజాగా రణబీర్ కపూర్, -అలియా భట్ జంట బ్రేకప్ అయ్యింది అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య మనస్ఫర్థలు తలెత్తాయన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇన్నాళ్లు అలియాతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగిన రణబీర్ ఆమెకు దూరమయ్యాడట. ఇక రణబీర్ గత చరిత్రను పరిశీలిస్తే తన ఎఫైర్ల గురించి అందరికీ తెలిసిందే. గతంలో దీపిక పదుకునే, కత్రినా కైఫ్… ఇలా చాలా మందితో ప్రేమ వ్యవహారాన్ని నడిపించాడు ఈ యంగ్ హీరో. దీపిక, కత్రినాలతో పెళ్లి వరకూ వచ్చి వెనక్కి తగ్గాడు. ఇలాంటి కథలు రణబీర్ లైఫ్లో ఇంకా చాలానే ఉన్నాయి. ఆ బ్రేకప్లు అన్నింటి తర్వాత రణబీర్… అలియాతో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డాడు.
అనంతరం ఈ జంట పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. ఇరు కుటుంబాల సమక్షంలో రహస్యంగా ఎంగేజ్ మెంట్ కార్యక్రమం పూర్తి చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది. ఈసారి బుద్ధిగా అలియాని పెళ్లి చేసుకుని రణబీర్ ఓ ఇంటివాడు కావడం ఖాయమని భావించారంతా. కానీ అది మున్నాళ్ల్ల ముచ్చటేనని తాజాగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్ఫర్ధలు తలెత్తినట్లు చిలవలు పలవులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అవి నిజమేనని ఓ వేడుక నిరూపించింది. అలియా భట్ పుట్టిన రోజు వేడుక ఈనెల 15న ఘనంగా జరిగింది. ఆ వేడుకల్లో రణబీర్ ఎక్కడా కనిపించలేదు. కనీసం విషెస్ కూడా చెప్పినట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదు. దీంతో అలియా కూడా రణబీర్కు దూరంగానే ఉందని ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది.