ఇండోనేషియా, వియత్నాం బృందాలపై ఆరా.!
నకిలీ శానిటైజర్ కంపెనీలపై నిఘా
వైరస్పై అవగాహన కోసం పోలీసుల పల్లెబాట
ప్రతి గ్రామానికి ఓ అధికారి నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీస్శాఖ మరింత అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్ కేసులపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటనలను పరిశీలిస్తున్న పోలీసుశాఖ వైరస్ వ్యాప్తి నియంత్రణ, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతతో పాటు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్టాండుల్లో పోలీసులు ప్రత్యేక పికెట్లను కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నేరుగా క్వారంటైన్ సెంటర్లకు తరలించే బాధ్యతను పోలీసులు స్వీకరించారు. ముఖ్యంగా కరీంనగర్ లో ఇండోనేషియా నుంచి వచ్చిన వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
కరీంనగర్కు విదేశాల నుంచి ఎంత మంది వచ్చారు. వారు ఎక్కడెక్కడ సంచరించారన్న సమాచారం సేకరించడంతో పాటు వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. కరీంనగర్లో ఇండోనేసియా పౌరులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విదేశీయులపై ప్రత్యేక దృష్టి సారించారు.అలాగే నల్గొండలోని జైల్ఖానా సమీపంలోని ప్రార్థనా మందిరానికి వియత్నాం బృందం వచ్చిందని పోలీసులకు సమాచారం అందండంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు 12 మంది పెద్దలతో పాటు ఇద్దరు చిన్నారులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు తరలించి వైద్యపరీక్షలు చేయించారు.వియత్నాంకు చెందిన పర్యాటకులు మార్చి 4న ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇదిలావుండగా కరీంనగర్లో ఇండోనేసియన్లకు కరోనా రావడంతో అప్రమత్తమైన పోలీసులు నల్గొండలో ఉన్న వియత్నాం వాసులను అదుపులోకి తీసుకొని మొదట హైదరాబాద్లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలలో వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో ముందుజాగ్రతగా గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డకు తరలించి అబ్జర్వేషన్లో ఉంచారు. రాష్ట్రంలో ఎక్కడైనా విదేశీయులు కనిపిస్తే సమాచారం అందించాలని పోలీసుల అధికారులు కోరుతున్నారు. కరీంనగర్లో ఇండేనేసియా పర్యాటకులకు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమై స్థానికులకు కూడా రక్త పరీక్షలు చేశారు.
దుకాణాలన్నీ మూతపడడంతో ప్రస్తుతం కరీంనగర్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ కరీంనగర్లో పర్యటించనున్న నేపథ్యంలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలను పోలీసులు స్వయంగా పర్యవేక్షించనున్నారు.
పోలీస్శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కరోనా వైరస్పై అవగాహన, నియంత్రణ కోసం ఒక ప్రత్యేక పోలీస్అధికారిని నియమించింది. పట్టణాలు, గ్రామాలలో మత సంబంధమైన, రాజకీయ పరమైన సభలు, సమావేశాలు, వివాహాలకు అనుమతులను నిరాకరిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రజలు సైతం పోలీసులకు తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు.
నకిలీ శానిటైజర్లపై నిఘా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మార్కెట్లో హ్యాండ్ శానిటైజర్లకు గిరాకి ఏర్పడుతుంటంతో కొందరు నకిలీ శాటిటైజర్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు నిఘా సారిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ పేరిట నకిలీ శానిటైజర్ల వ్యాపారాల గుట్టును పోలీసులు రట్టు చేసిన విషయం విదితమే. ఎస్ఒటి, కుషాయిగూడ పోలీసులు ఆయూష్ డ్రగ్ అధికారులు, కాప్రా రెవిన్యూ అధికారులు సంయుక్తగా దాడులు జరిపి నకిలీ శానిటైజర్లను తయారు చేస్తున్న ఓ కంపెనీపై ఆకస్మిక దాడులు జరిపి ముగ్గురిని అరెస్టు చేసి సుమారు 40 లక్షల విలువైన యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.