బలపరీక్ష నిర్వహించకుండానే వైదొలిగిన మధ్యప్రదేశ్ సిఎం
గవర్నర్కు అందజేసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు
బిజెపి కుట్ర రాజకీయాలకు బలయ్యాం
15 నెలలు రాష్ట్ర అభివృద్ధికే పాటుపడ్డా : కమల్నాథ్
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు గురువారంనాడు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 మాసాలపాటు ఆయన సిఎం పదవిలో ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన 22 మంది శాసనసభ్యులు కమల్నాథ్పై తిరుగుబాటు చేయడంతో ఆయన సర్కార్ మైనార్టీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరిపడా బలం లేకపోవడంతో శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్భవన్లో గవర్నర్ లాల్జీ టాండన్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ‘నా 40 ఏళ్ల ప్రజా జీవితంలో స్వచ్ఛమైన రాజకీయాలనే చేశాను. ప్రజాస్వామిక విలువలను పాటిస్తూ ప్రజాస్వామ్య పరిపుష్టికి కృషి చేశాను.. వాటికే ప్రాధాన్యత ఇచ్చాను.
గత రెండు వారాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి చోటు ఇచ్చారు. అదేంటంటే ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడం.. వాటిని బలహీన పరచడం’ అని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా కాబోయే కొత్త సిఎంకు అభినందనలు కూడా తెలుపుతున్నానన్నారు. అంతకుముందు కమల్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గడిచిన 15 నెలల్లో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, అయినా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బిజెపి కుట్రలు పన్నిందన్నారు.
తమ పార్టీకి చెందిన ఎంఎల్ఎలను కర్నాటకలోని ఓ హోటల్లో నిర్బంధించారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు పరిపాలన చేయాలని ప్రజలకు తమకు అధికారం కట్టబెట్టారని, కానీ తనకు వ్యతిరేకంగా బిజెపి నిరంతరం కుట్రలు చేస్తూనే వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా బిజెపి నాయకులు తమ ఎంఎల్ఎలను కొనుగోలు చేశారని, అందుకు కొందరు స్వార్థపరులైన నేతలు, శాసనసభ్యులు సహకరించారని జ్యోతిరాదిత్య సింధియా, ఆయన వర్గ ఎంఎల్ఎలను ఉద్దేశించి అన్నారు. పదవికి రాజీనామా చేసినా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాస్వామ్య విలువల కోసం కృషి చేస్తూనే ఉంటానన్నారు. తన ప్రభుత్వం రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధికోసం ఈ 15 మాసాలు పనిచేసిందన్నారు.
అర్ధరాత్రి 16మంది రాజీనామాలకు స్పీకర్ ఆమోదం
ఇప్పటికే ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్ ప్రజాపతి గురువారంనాడు అర్ధరాత్రి మిగిలిన 16మంది శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించారు. దీంతో అసెంబ్లీలో సంఖ్యాపరంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సభలో మెజార్టీకి కావాల్సిన సభ్యలు సంఖ్య 104కి పడిపోయింది. కాంగ్రెస్ 92 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉండగా.. ప్రతిపక్ష బిజెపికి సొంతగా 107 ఎంఎల్ఎలతో పాటు, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బిఎస్పి, ఒక ఎస్పి సభ్యుడి మద్దతుగా కూడా ఉంది. దీంతో సభలో మారిన సమీకరణల దృష్ట్యా బలపరీక్షలో కమల్నాథ్ ప్రభుత్వం గెలుపొందడం అంత తేలిక కాదని తేలిపోయింది.