మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా(కొవిడ్ 19) ప్రభావంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ ఎంఎల్ఎ కోనేరు కోనప్పను హోం క్వారంటైన్ కావాల్సిందిగా ఆ జిల్లా వైద్యాధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో 14 రోజుల పాటు బయటకు వెళ్లోదని ఎలాంటి సమావేశాల్లో పాల్గొనవద్దని, ఎంఎల్ఎతో పాటు అతని భార్యను కూడా క్వారంటైన్లో ఉండాలని అధికారులు నోటీసులు పంపించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకున్న నిబంధనలు ప్రకారం ఈ నోటీసులు పంపించామని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సహకరించాలని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఎంఎల్ఎ కోనప్ప ఇటీవలే అమెరికా పర్యటనకు సతీసమేతంగా వెళ్లారు. అక్కడ నుంచి మంగళవారం తిరిగి వచ్చారు. విమానం దిగి నేరుగా రైలెక్కి ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్లారు. అదే రోజు ప్రజల మధ్య తిరిగినట్లు సమాచారం. అనంతరం ఆ తర్వాత రోజు బుధవారం కాగజ్నగర్ మునిసిపల్ బడ్జెట్ సమావేశానికి కూడా హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. అనంతరం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.