న్యూఢిల్లీ/భోపాల్ : ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ నేత కమల్నాథ్ రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బిజెపి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు అవకాశాలున్నాయి. కమల్నాథ్ ప్రభుత్వం పతనం వెనక కీలక పాత్ర పోషించిన మాజీ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి బిజెపి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించడం ఖాయమని ఊహాగానాలు వినపడుతున్నాయి. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, నరోత్తం మిశ్రాల పేర్లు కూడా సిఎం పదవికి పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ చౌహానే వారికన్నా ముందు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో బిజెపి శాసనసభా పక్షం సమావేశమైన కొత్త నాయకుడిని ఎన్నుకోనుంది. పదవి విషయంలో బిజెపి అధిష్టానం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, త్వరలో ఇది సుస్పష్టమవుతుందని ఒక సీనియర్ నాయకుడు పేర్కొన్నా రు. ప్రజలతో అత్యుత్తమ సంబంధాలున్న వ్యక్తి, ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉండడంతో పాటు రాష్ట్రం లో బిజెపి తరపున ప్రముఖ నేతగా ఉన్న శివరాజే తిరిగి నాయకుడవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.