హైదరాబాద్: కరోనా నియంత్రణ వైద్యసేవలకు అంకితమై పెళ్లిని వాయిదా వేసుకున్న డాక్టర్ షపీ మహ్మద్ను ట్విట్టర్లో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత అభినందించారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంకు చెందిన వైద్యురాలు షపీకి మహ్మద్కు మార్చి 29న దుబాయ్కి చెందిన ఓ వ్యాపారితో పెళ్లి నిశ్చయం అయింది. మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికూతురుగా ప్రత్యేకంగా చేసుకున్న అలంకరణతోనే ఆసుపత్రికి వచ్చి కరోనా వైద్యసేవల్లో నిమగ్నమైంది.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పెళ్లికంటే కరోనా రోగులకు సేవచేయడమే ముఖ్యమని కుటుంబసభ్యులకు నిర్ణయం తెలుపగా కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో పెళ్లి వాయిదా వేసుకుని తిరువనంతపురంలోని పెరియారం మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో రోగులకు చికిత్స చేస్తున్నారు. పెండ్లి వాయిదా వేసుకుని రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్ షపీ గురించి తెలుసుకున్న కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో అభినందించారు. కరోనాను పారదోలేందుకు నర్సులు,డాక్టర్లు చేస్తున్న సేవలను ప్రజలను ఏనాడు మరిచిపోరని, వారి వైద్యసేవలు ఎంతో ఉన్నతమైనవని కవిత పేర్కొన్నారు. అయితే నర్సులు,డాక్టర్లు చేస్తున్న సేవలతో పాటుగా ప్రజలు లాక్డౌన్లో పాల్గొని స్వీయ నియంత్రణతో కరోనాను తరిమివేయాలని కవిత కోరారు.