రంగారెడ్డి: మూడు రోజుల్లో పండ్ల మార్కెట్ను ప్రారంభిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కోహెడలో పండ్ల మార్కెట్ల పనులను మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్ఎలు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని, కరోనా నేపథ్యంలో కోహెడలో యుద్ధ ప్రాతిపదికన మార్కెట్ సిద్దం చేస్తున్నామని, ఔటర్ నుంచి మార్కెట్ వరకు వెంటనే లైటింగ్ ఏర్పాటు చేశామని, రైతులు, ఏజెంట్లు, సహాయకుల కోసం క్యాంటిన్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో నాలుగు లక్షల ఎకరాల్లో మామిడి సాగు అవుతోందని, మార్కెట్లో సిసి కెమెరాలు, ప్రాథమిక చికిత్స కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, పార్కింగ్ వంటి సౌకర్యాలు సిద్ధం చేశామన్నారు. రైతులు, ఏజెంట్లు సామాజిక దూరం పాటించాలన్నారు.