వాషింగ్టన్ : భారత సంతతి అమెరికా దంపతులు ప్రొఫెసర్ దేవేష్ రంజన్, డాక్టర్ కుముదా రంజన్ తక్కువ ఖరీదులో లభించే పోర్టబుల్ ఎమెర్జెన్సీ వెంటిలేటర్ను రూపొందించారు. ఇది త్వరలో ఉత్పత్తి దశకు చేరుకుంటుంది. భారత్ లోనే కాకుండా వర్ధమాన దేశాలన్నిటి లోను కరోనా రోగులకు వైద్యం చేసే డాక్టర్లకు సహాయంగా తక్కువ ధరలో అందుబాటు లోకి వస్తుంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో తగిన వెంటిలేటర్లు అందుబాటులో లేక పోవడం ఈ వెంటిలేటర్ రూపకల్పనకు దోహదం చేసింది. జార్జియా టెక్ జార్జి డబ్లు వుడ్ఫ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ దేవేష్ రంజన్ పనిచేస్తున్నారు. , అతని భార్య కుముదా రంజన్ ఫ్యామిలీ ఫిజీషియన్గా అట్లాంటాలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇటువంటి వెంటిలేటర్ అమెరికాలో మామూలుగా 10,000 డాలర్ల వరకు ధర పలుకుతుందని, అయితే ఇది ఐసియు వెంటిలేటర్ కాదని, అత్యంత ఆధునికమైనదని, ధర ఎక్కువగా ఉంటుందని రంజన్ చెప్పారు. కరోనా రోగులకు సాధారణంగా వచ్చే ఊపిరి తిత్తులు బిగిసి పోవడం వంటి తీవ్ర శ్వాసకోశ సమస్యను ఈ వెంటిలేటర్ వల్ల నయమౌతుందని చెప్పారు. ఓపెన్ ఎయిర్ వెంట్ జిటి ని తాము అభివృద్ధి చేయగలిగామని తెలిపారు. జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఈ వెంటిలేటర్ను అభివృద్ధి చేశారు.
ఎలెక్ట్రానిక్ సెన్సార్లను, కంప్యూటర్ కంట్రోలును ఉపయోగించి రూపొందించారు. పాట్నా, బీహార్ల్లో పుట్టి పెరిగిన రంజన్, తిరుచ్చిలో రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి డిగ్రీ పొందారు. విస్కన్సిన్మెడిసిన్ యూనివర్శిటీ నుంచి పిహెచ్డి పొందారు. గత ఆరేళ్లుగా జార్జియాటెక్లో బోధకునిగా పనిచేస్తున్నారు. భార్య కుముద తన తల్లిదండ్రులతో రాంచి నుంచి ఆరేళ్ల ప్రాయంలో అమెరికా వెళ్లారు. న్యూజెర్సీలో వైద్య శిక్షణ పొందారు.