ఆడపిల్లకూ తండ్రి ఆస్తిలో సమాన హక్కు
తండ్రి 2005కు ముందు మరణించినా కుమార్తెకు ఆస్తి పొందే హక్కు
కుమార్తె ఎప్పటికీ కుమార్తే.. సమష్టి కుటుంబంలో భాగస్వామే
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆరు నెలల్లోగా పెండింగ్ కేసులు పూర్తి చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన ఆస్తిపై ఆడపిల్లలకున్న హక్కు గురించి సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. తండ్రి (లేదా తల్లి) 2005 కన్నా ముందే మరణించినప్పటికీ కుమార్తెలకు వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం నాటి తీర్పులో స్పష్టం చేసింది. కూతురు ఎప్పటికీ కూతురేనని, హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 అమలులోకి రావడానికి ముందే తండ్రి మరణించినప్పటికీ ఆ తండ్రి ఆస్తిలో వాటా పొందే హక్కు ఆయన కుమార్తెకు ఉంటుందని, ఆమె సమష్టి కుటుంబ భాగస్వామేనని స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎస్ నజీర్, ఎంఆర్ షా కూడా సభ్యులుగా ఉన్నారు. తండ్రి మరణించినప్పటికీ 2005 నాటి చట్టం అమలులోకి తండ్రి, కూతురు ఇద్దరూ జీవించి ఉంటేనే కుమార్తెకు సహ వారసత్వ హక్కు దఖలవుతుందని సుప్రీంకోర్టు 2005 సెప్టెంబర్ 9న సవరణ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సవరణ తేదీ నాటికి కుమార్తె, తండ్రి జీవించి ఉన్నా లేకున్నా ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందన్న తాజా తీర్పు ప్రాముఖ్యతను సంతరించుకుంది. సవరణ తేదీ నాటికి కుమార్తె జీవించి లేకున్నా ఆమె సంతానం చట్టపరంగా ఆమెకు రావలసిన వాటాను కోరవచ్చు.
హిందూ వారసత్వ చట్టం, 2005 అమలు గురించి భిన్నాభిప్రాయాలు రావడంతో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటినుంచి హిందూ కుటుంబంలోని కుమార్తె సమష్టి కుటుంబ సహ భాగస్వామురాలవుతుంది. కానీ ఈ చట్ంట అమలులోకి రావడానికి ముందు తండ్రి మరణించినప్పుడు ఆయన కుమార్తెకు ఈ హక్కు ఉంటుందా అనే అంశంపై స్పష్టత లేదు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం వివరణ ఇచ్చింది. ఈ వివరణతో మహిళలకు కుటుంబంలో సమాన గౌరవం, హోదా, హక్కులు లభిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు పరస్పర భిన్నంగా ఉండడంతో దీనిపై వివరణ కోరారు. దీంతో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ వివరణ ఇచ్చింది.‘ఈ చట్టంలోని సెక్షన్6 ద్వారా కుమార్తెలకు కల్పించిన సమానత్వ హక్కును పోగొట్టరాదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఈ అంశంపై వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న విచారణలను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.
Daughters have right to HUF Property even if their father died