రెండేళ్లుగా బాలికపై అత్యాచారం, బ్లాక్మెయిల్
బాధితుల జాబితాలో మరో ఆరుగురు మహిళలు
మధ్యప్రదేశ్లో వ్యాపారి అరెస్టు
భోపాల్: ఒక 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాకు చెందిన ఒక 40 ఏళ్ల వ్యాపారిని పోలీసులు అరెస్టుచేశారు. అతను బ్లాక్మెయిల్ చేసిన మహిళలలో ఈ బాలిక ఏడవ వ్యక్తని పోలీసులు తెలిపారు. సమీర్ అనే వ్యక్తి తనపై గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేశాడని ఆ బాలిక కోల్గావన్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు సాత్నా ఎస్పి రియాజ్ ఇక్బాల్ తెలిపారు. ఆ బాలిక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సమీర్ అలియాస్ అతీక్ను ఆదివారం అరెస్టు చేశారు. అతని ఇంటితోపాటు అతను నడిపించే జిమ్, సైబర్ కేఫ్లపై కూడా పోలీసులు దాడులు నిర్వహించి అతని పేరిట ఉన్న రెండు పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.
మత మార్పిడి చేసుకుని ఒక మహిళను వివాహం చేసుకున్న నిందితుడు 2017లో ఆమెకు విడాకులు ఇచ్చాడని ఎస్పి చెప్పారు. మహిళలతో సంబంధాలు పెట్టుకుని వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించడమే అతను పనిగా పెట్టుకున్నాడని ఆయన తెలిపారు. బ్లాక్మెయిల్ చేయడం ద్వారా అతను పెద్దమొత్తంలో డబ్బు సంపాదించినట్లు ఆయన చెప్పారు. బాధిత మహిళలంతా పోలీసులకు తమ గోడు వెళ్లబోసుకున్నారని, అయితే లిఖితపూర్వక ఫిర్యాదుకు వారు ముందుకు రాలేదని ఎస్పి చెప్పారు. నిందితుడి ఇల్లు, వ్యాపార కేంద్రాలపై జరిపిన దాడులలో సాత్నా, రేవాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లతో గల లెటర్హెడ్లు లభించాయని ఎస్పి చెప్పారు. ఈ లెటర్హెడ్లతో విఐపి కోటా కింద రైల్వే రిజర్వేషన్లు చేసి వాటిని కూడా అమ్ముకునేవాడని ఎస్పి తెలిపారు.
MP Businessman arrested after girl raped