హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు గొప్పగా పని చేస్తే మిగతా 28 రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్పతనం వల్లే తెలంగాణలో ఉచిత సాధ్యమైందని కొనియాడారు. గతంలో నీళ్లు, కరెంట్ కోసం అసెంబ్లీ సాక్షిగా ఆందోళనలు జరిగేవని, కానీ ఇప్పుడు విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన విజయాలు అని ప్రశంసించారు. శ్రీశైలం పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చర్చ జరిగిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉండేదని, కరెంట్ కోతల వల్ల పరిశ్రమలు మూతపడ్డాయని, తెలంగాణ ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2700 మెగావాట్లు ఉందని, స్వరాష్ట్రంలో అతి తక్కువ కాలంలో విద్యుత్ సమస్యను అధిగమించామని, అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ను ఇస్తున్నామని తెలియజేశారు. కేంద్ర నూతన విద్యుత్ చట్టంతో ఉచిత విద్యుత్కు ఆటంకం ఏర్పడుతుందని, బోరు బావులకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్ర నూతన విద్యుత్ చట్టం తీసుకరావడంతో పేదలకు ఉచిత విద్యుత్ సాధ్యపడదన్నారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉందని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రానికి సిఎం కెసిఆర్ ఇదివరకే లేఖ రాశారని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.