కారేపల్లి: రైతు చుట్టూనే రాజ్యం తిరుగుతోందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామపంచాయితీలో ఆదివారం రైతులకు రూ. 25 లక్షలు విలువచేసే వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లను వైరా ఎంఎల్ఏ లావుడియా రాములు నాయక్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు శ్రమ తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే 15 రకాల వ్యవసాయ పనిముట్లు అందించటం జరిగిందన్నారు. ఎప్పుడూ రైతు సంక్షేమం గురించే ఆలోచించే సిఎం కెసిఆర్ రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు పంట పెట్టుబడి ఎకరాకు రూ. 10 వేలు అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. జిల్లాలో రైతు బంధు వేదికలు 239 నిర్మిస్తున్నారని, వాటి ద్వారా రైతుకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం చేస్తుందన్నారు.
సీతారామ ప్రాజెక్ట్ ద్వారా త్వరలో కారేపల్లి మండలానికి నీరు కొరత లేకుండా అందుతోందని, ఆ ఘనత వైరా ఎంఎల్ఏ రాములు నాయక్కే చెందుతుందన్నారు. లోగడ కరెంట్ కొరత ఉండేదని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు కరెంట్ ఉచితంగా రైతులకు అందించటం జరుగుతోందన్నారు. వైరా ఎంఎల్ఏ లావుడియా రాములు నాయక్ మాట్లాడుతూ మంత్రి అజయ్కుమార్ కృషి వల్లే మండలం అభివృద్ధి చెందుతోందని, కారేపల్లి మండలానికి ఇంకా నిధులు మంజూరు చేయాలని కోరారు. గాంధీనగర్, కొత్తతండా, చీమలవారిగూడెం గ్రామాలలోని ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను మంత్రి అజయ్కుమార్ ప్రారంభించారు. మంత్రికి, ఎంఎల్కు పార్టీ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పిఓ గౌతం, అడిషనల్ కలెక్టర్ స్నేహలత, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జట్పి చైర్మన్ లింగాల కమల్రాజ్, పలువురు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Minister Puvada says kingdom revolves around the farmer