నాంపల్లి: తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న నాంపల్లిలో 81వ అభిలభారత పారిశ్రామిక ఎగ్జిబిషన్ (నుమాయిష్) వచ్చే కొత్త ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియను యుద్ధ్ద ప్రతిపాదికన సిద్ధం చేసుకోవాలని సంస్థ చైర్మన్, రాష్ట్ర వైద్యశాఖమంత్రి ఈటల రాజేందర్ సొసైటీ వర్గాలకు ఆదేశించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ సందర్శకుల ప్రయోజనలు, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే ఎగ్జిబిషన్ను నిర్వహిస్తామని తెలిపారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ హాల్లో సొసైటీ మేనేజింగ్ కమిటీ పక్షాన” ఎగ్జిబిషన్ను ప్రారంభించాలా అనే అంశంపై” సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు కొవిడ్ నిబంధనలు, కేంద్ర మార్గదర్శకాలు అమలు తప్పనిసరిగా పాటించాల్సి ఉందన్నారు.
ప్రతి ఏటా తరహాలో నగరవాసులకు కనువిందుచేస్తున్న ఎగ్జిబిషన్ నిర్వహణ సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి కావాలని ఈ దిశగా నుమాయిష్ ఏర్పాట్లకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన సొసైటీ వర్గాలను నిర్దేశించారు. గతేడాది సుమారు 2500 స్టాళ్లను ఏర్పాటు చేశారని ఈ దఫా స్టాళ్ల కేటాయింపుల సంబంధించి వ్యాపారులకు దరఖాస్తు ఫారాలు అందించాలని, దీనికి సంబంధించి ఛార్జీల రూపంలో వసూళ్లు చేయాలన్నారు. ఏటా అక్టోబర్ నెలలో నుమాయిష్ నిర్వహణ ఏర్పాట్ల ప్రక్రియ మొదలవుతుందని ఒక వేళ నుమాయిష్ నిర్వహణకు సర్కార్ అనుమతి ఇవ్వకపోతే వ్యాపారులకు తిరిగి డబ్బులు వాపస్ చేయాలని పేర్కొన్నారు.
సర్కార్ అనుమతి ఇస్తేనే ఎగ్జిబిషన్ కొనసాగిస్తామని, లేకుంటే లేదన్నారు. నుమాయష్ నిర్వహణకు మంజూరు, లక్షలమంది జనం భద్రతకు ముడిపడి ఉన్న ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అందరికి శిరోధార్యమని రాజేందర్ పేర్కొన్నట్లు ఎగ్జిబిషన్ వర్గాలు చెబుతున్నారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్, ఉపాధ్యక్షుడు సురేందర్, కోశాదికారి వినయ్కుమార్, ప్రతినిధులు గంగాధర్, సంతోష్ నారాయణ, రంగారెడ్డి, చక్రవర్థి తదితరులు పాల్గొన్నారు.