ముంబై : రైతుల ప్రయోజనాలు ఆశించి నేషనల్ డెమొక్రటిక్ అలియెన్స్ (ఎన్డిఎ) నుంచి వైదొలగడానికి శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) నిర్ణయించడాన్ని శివసేన ఆదివారం ప్రశంసించింది. శనివారం రాత్రి శిరోమణి అకాలీదళ్ తాను ఎన్డిఎ నుంచి తెగతెంపు చేసుకుంటున్నట్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ విధంగా శివసేన, తెలుగుదేశం తరువాత గత రెండేళ్లలో ఎన్డిఎ నుంచి తెగతెంపులు చేసుకున్న మూడో ప్రధాన పార్టీ శిరోమణి అకాలీదళ్. గత ఏడాది ముఖ్యమంత్రి పదవిపై బిజెపితో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా ఎన్డిఎతో శివసేన తెగతెంపులు చేసుకుంది.
ఈ విధమైన తెగతెంపులను ప్రశంసిస్తూ శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. అంతకు ముందు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ శివసేన, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఎన్డిఎ స్తంభాలుగా వ్యాఖ్యానించారు. ఇతరపార్టీలు అధికారం కోసం ప్రాకులాడినప్పుడు ఈ రెండు పార్టీలు బిజెపికి మద్దతుగా నిలిచాయని, కానీ ఇప్పుడు ఈ పరిణామం జరగడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాల బట్టి కేంద్రం లోని ప్రభుత్వాన్ని ఎన్డిఎ గా భావించరాదని ఇది విభిన్నమైన కూటమిగా ఆయన వ్యాఖ్యానించారు.