హైదరాబాద్: రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే పన్నుల్లో సగం మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. వివరాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2014 నుంచి పన్నుల ద్వారా కేంద్ర రూ. 2,75,926 కోట్లు తీసుకుని, తిరిగి రూ.1,40,329 కోట్లను మాత్రమే రాష్ట్రానికి ఇచ్చిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది తక్కువ.. తీసుకునేది ఎక్కువని మంత్రి విమర్శించారు. కీలక రంగాల్లో పెట్టుబడులు, మూలధన వ్యయం ఫలితంగానే వృద్ధి సాధ్యమైంది. వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ లో వృద్ధి కొనసాగిందని చెప్పారు. 2014-2020 మధ్య దేశ తలసరి ఆదాయం 54.9శాతం పెరిగింది. అదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయం 83.9శాతం పెరిగిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన పరిపాలన విధానాలతో రాష్ట్ర జిడిపి భారీగా పెరిగిందన్నారు. దేశ జిడిపి వృద్ధిరేటు కంటే తెలంగాణ జిడిపి వృద్ధిరేటు చాలా ఎక్కువని, కేంద్ర, రాష్ట్ర ఆర్ధిక గణాంకాలను వివరిస్తూ మంత్రి కెటిఆర్ ఆదివారం ట్వీట్ చేశారు.
Telangana achieving GDP growth rate than country