హైదరాబాద్: పోలీసుల విచారణలో క్లూస్ అండ్ ఫింగర్ ప్రింట్ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం ఆయన క్లూస్ అండ్ ఫింగర్ ప్రింట్ 12 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. నేరాలు జరిగినప్పుడు సంఘటన స్థలం నుంచి వేగంగా సైంటిఫిక్ క్లూస్ను సేకరించేందుకు వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. నేరస్థులకు శిక్షపడడంతో సైంటిఫిక్ క్లూస్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. గతంలో 3 జోనల్ క్లూస్ టీములు పనిచేశాయని, మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ జోన్లలో పనిచేస్తున్నాయని తెలిపారు. కొత్తగా 9 డివిజనల్ లెవల్ క్లూస్ టీములను ఏర్పాటు చేశామని తెలిపారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో ఒక ఫింగర్ ప్రింట్ యునిట్ పనిచేసిందని, కొత్తగా మూడు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి క్లూస్ టీములో నాలుగురు సీన్ ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. ఫోరెన్సీక్ నిపుణులు, ఇద్దరు ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు,ఇద్దరు డ్రైవర్లు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయని తెలిపారు. ఫింగర్ ప్రింట్ యూనిట్లో ఒక ఫింగర్ ప్రింట్ నిపుణుడు, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు డ్రైవర్లు, ఇరవైనాలుగు గంటలు పనిచేస్తారని తెలిపారు. డిజిటల్ కెమెరా, జనరల్ క్రైం సీన్ కోఆర్డినేషన్ కిట్, బాడీ ఫ్లూయిడ్ కలెక్షన్ కిట్, కంప్యూటర్, ప్రింటర్ తదితరాలను టీమ్స్కు అందజేశారు. కార్యక్రమంలో డిసిపిలు ప్రకాష్ రెడ్డి, ఎస్ఎం విజయ్కుమార్, పద్మజా, వెంకటేశ్వర్లు, అనసూయ, సైటింఫిక్ ఆఫీసర్ వెంకన్న, ఎడిసిపిలు ప్రవీణ్కుమార్, మాణిక్రాజ్, లావణ్య, కవిత, ఎసిపిలు, ఇన్స్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.