కాంగ్రెస్ అధినేత్రి సోనియా సైక్లింగ్
పనాజీ: ఢిల్లీలో వాయు కాలుష్యంతో గోవా చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకించి సోనియా సైక్లింగ్కు దిగారు. ఇతరత్రా వ్యాయామాలు సంగతి పక్కనపెడితే ఈ సైక్లింగ్ చాలా మంచిదని భావించుకుని సోనియా సైకిల్పై పచార్లు చేశారు. గోవాలోని లీలా ప్యాలెస్ హోటల్ ఆవరణలో సోనియా సైక్లింగ్ ఇప్పుడు వైరల్గా మారింది. కాంగ్రెస్ అధినేత్రి చాలా కాలంగా శ్వాస కోశ వ్యాధులు ఇతరత్రా ఇబ్బందులతో బాధపడుతున్నారు. దీనితో తీవ్ర కాలుష్య సమస్య ఉన్న ఢిల్లీని వదిలి వేరే దగ్గర విశ్రాంతి పొందుతూ చికిత్స తీసుకోవడం మంచిదని డాక్టర్లు సూచించారు. దీనితో తనయుడు రాహుల్ గాంధీ వెంటరాగా సోనియా ఏరికోరి గోవాకు వచ్చారు. అక్కడ ప్రఖ్యాత హోటల్లో బస చేస్తున్నారు. ఉదయం సాయంత్రం నడక తరువాత సైక్లింగ్కు దిగుతున్నారు. 73 సంవత్సరాల సోనియా తెల్లటి దుస్తులలో సైకిల్పై సవారీకి వెళ్లడంతో ఇప్పుడు రహదారుల వెంబడి వచ్చిపొయ్యే వారు కొద్ది సేపు నిలిచి చూస్తున్నారు. పార్టీ రాజకీయాలు, దేశ సమస్యలపై తరచూ ఆలోచించాల్సి వచ్చే సోనియా ఆటవిడుపుగా కొద్ది సేపు వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.