మనతెలంగాణ/హైదరాబాద్ : నింగిని గెలిచిన నేల కథల సంపుటిని ఎడిజిపి స్వాతి లక్రా బుధవారం నాడు మహిళా భద్రత కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈక్రమంలో మహిళలపై జరిగే హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా భద్రత భరోసా, బాధ్యత అనే అంశంపై మహిళా భద్రత విభాగం బుధవారం నాడు సదస్సును నిర్వహించారు. తెలుగు ఉమెన్ రైటర్స్ ఫోరం, అక్షరయాన్ ల సంయుక్త నిర్వహణలో జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించిన ఈ సదస్సులో నింగిని గెలిచిన నేల అనే 50 కథల సంపుటిని మహిళా భద్రతా విభాగం అడిషనల్ డి.జి స్వాతి లక్రా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎడిజిపి స్వాతిలక్రా మాట్లాడుతూ.. రేపటి మహిళలైన నేటి బాలికల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, సంపూర్ణ మూర్తిమత్వం పెంచేందుకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం కృషి చేస్తుందని తెలిపారు. ఇందుకుగాను ప్రత్యేక బాలిక విభాగాన్ని కూడా ప్రారంభించనున్నామని, బాగా రాయగలిగిన, పాడ గలిగిన పలు కళా రంగాల్లో ప్రవేశం ఉన్న బాలికలకు చట్ట, న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు.
అతివ రక్షణ, ఆడ పిల్లల మీద వివక్ష అనే అంశంపై పాటల పోటీలు, కరోనా అంశంగా కవితల పోటీలు నిర్వహించామని, దీనితో పాటు పలువురు రచయిత్రిలు రాసిన 50 కథలతో కూడిన నింగిని గెలిచిన నేల అనే పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ సమీక్షించారు. అనంతరం డి.ఐ.జి బి.సుమతి మాట్లాడుతూ బాలిక విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఐదుగురు భిన్న కళారంగాలకు చెందిన అమ్మాయిలైన అద్వైతనాయుడు, కర్రీ రేణిత, కృతివెంటి హేమలత, శ్రీచందన, హన్సీకలను ఎంపిక చేసినట్లు వివరించారు. మహిళలు, పిల్లల సంరక్షణ, భద్రతా, వికాసానికి రాష్ట్ర మహిళా భద్రతా విభాగం నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. ఈ జూమ్ సదస్సులో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, వాణి దేవులపల్లి, రమాదేవి కులకర్ణీ, గురజాడ శోభ పేరిందేవి, సుజాత శేఖర్, సమ్మెట విజయ, యాకమ్మ, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.