రేపు, ఎల్లుండి పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సిఎస్ ఆదేశం
హైదరాబాద్: బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్లోని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల బుధ, గురు, శుక్ర వారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ‘నివర్’ తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఆదేశించారు.
ఏజెన్సీలో పెరుగుతున్న చలి
ఏజెన్సీ ప్రాంతాల్లో గత 2 రోజులుగా రాత్రి ఉష్ణోగ్రత లు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి 7 గంటల నుంచే మంచు
ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి 7 గంటల నుంచే మంచు కురుస్తోంది. కాగా, ‘నివర్’ తుఫాను ధాటికి తమిళనాడు, పుదుచ్చేరిల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బుధ, గురువారాల్లో ఎపిలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండి సూచనల ప్రకారం తీవ్ర తుఫానుగా మారిన నివర్ తుఫాను కడలూర్ కి తూర్పు ఆగ్నేయం 300 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. బుధవారం సాయంత్రానికి తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండి అధికారులు తెలిపారు.