జవహర్నగర్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చెన్నాపురంలో చోటుచేసుకుంది. సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం… జవహర్నగర్ పరిధిలోని ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో నివాసం ఉండే నాగేశ్వర్రావు, నాగమణి (28) దంపతులు. వీరు ఇద్దరు ఇద్దరు కుమార్తెలు మార్వెల్ రూబీ (5), 8 నెలల చిన్న కుమార్తెతో కలిసి కాలనీలో నివాసం ఉంటున్నారు. క్రిస్మిస్ పండుగను పురస్కరించుకొని నాగమణి తన పుట్టింటికి వెళ్లి వస్తానని భర్తను అడగగా ఇప్పుడు వద్దు పండుగ అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్లమని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శనివారం ఉదయం నాగమణి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బయటకు వెళ్లి తిరిగిరాలేదు.
దీంతో భార్య, పిల్లలు కనబడకపోవడంతో నాగేశ్వర్రావు చుట్టు పక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో అదే రోజురాత్రి జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతుండగా ఆదివారం ఉదయం బాలాజీనగర్లోని చెన్నాపురం చెరువులో మూడు మృతదేహాలు నీటిలో కనబడుతున్నాయని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తెప్పించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలా, లేక ఇంకేమైనా జరిగిందా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.