విశ్వాసపాత్రుడికి పార్టీ పగ్గాలు అప్పగించిన నితీశ్
పాట్నా: జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రామచంద్ర ప్రసాద్ సింగ్ ఎంపికయ్యారు. ఆదివారం పార్టీ కార్యవర్గమంతా కలిసి ఆర్సి సింగ్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది. బీహార్లోని నలందనుంచి జెడి(యు) తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సింగ్ ముఖ్యమంత్రి నితీశ్కు అత్యంత విశ్వాసపాత్రుడు. రాజకీయాల్లోకి రాకముందునుంచే ఐఎఎస్ అధికారి అయిన సింగ్కు నితీశ్ కుమార్తో సాన్నిహిత్యం ఉంది. నితీశ్ రైలే మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత 2005లో నితీశ్ బీహార్ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పని చేశారు. ఆ తర్వాత జెడి (యు)లో చేరి రాజ్యసభకు వెళ్లారు.
రాబోయే మూడు సంవత్సరాలు ఆర్సి సింగ్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని జెడి(యు) నేత కెసి త్యాగి చెప్పారు. గత కొంత కాలంగా తనను ఇబ్బంది పెడుతున్న సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బిజెపిని కట్టడి చేయడం కోసమే నితీశ్ తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన సింగ్కు పార్టీ బాధ్యతలు కట్టబెట్టారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్కు చెందిన ఎల్జెపిని బిజెపి పరోక్షంగా ప్రోత్సహించడంతో జెడి(యు) సీట్ల సంఖ్య ఆ పార్టీకన్నా తక్కువగా 43కు తగ్గిపోయాయి. దీంతో బిజెపి నితీశ్ ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కాగా ఆర్సి సింగ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో జెడి(యు) శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
RCP Singh new JD(U) president