జఫర్గడ్ : జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని సూరారం పంచాయతీ పరిధిలోని చర్లతండాలో మంగళవారం గిరిజనులు సీత్లా భవానీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఆశాడమాసంలో ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. గ్రామ పొలిమేర వద్ద గిరిజనుల ఆరాధ్య దేవతలను ఏడుగురిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్ళులతో యువతులు, మహిళలు, చిన్నారులు నృత్యాలు చేసుకుంటూ దేవతల వద్దకు సమూహంగా వెళ్ళి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు బాగా కురువాలని, పంటలు బాగా పండి, పిల్లా, పాపలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన నాయకుడు లకావత్ చిరంజీవి మాట్లాడుతూ సీత్లా భవానీ పండగ ప్రపంచం మొత్తంలో నివసిస్తున్న గిరిజన, లంబాడీల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతి రూపంగా నిలిచే పండగ అన్నారు. తండా పెద్దలు రాములు, దేశ్యా నాయక్, బలరాం, జమ్మిలాల్, బిక్షపతి, భాస్కర్, గణేశ్, విజయ్ మహిళలు, యువకులు పాల్గొన్నారు.
Seetla Bhavani Festival Celebrations