లండన్ : అఫ్గాన్ దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెట్టామని తాలిబన్లు ప్రకటనకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందిస్తూ మాటల ద్వారా కాకుండా చర్యల ద్వారానే వారిని అంచనా వేయాలని వ్యాకిఖ్యానించారు. అఫ్గాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో రెండు వేల మందికి పైగా అఫ్గాన్లు దేశం వీడేందుకు సహకరించామని ఆయన వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటన్ ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించిందని ఇప్పటివరకు 306 మంది బ్రిటన్ జాతీయుల్ని , 2052 మంది జపాన్ వాసుల్ని తమ ప్రభుత్వం సురక్షితంగా తరలించిందని వెల్లడించారు. పునరావాస కార్యక్రమంలో భాగంగా అనేక దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేశామని, మిగతా వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. అఫ్గాన్లు దేశం దాటాలని ప్రయత్నిస్తోన్న తరుణంలో మంగళవారం రాత్రి బ్రిటన్ ప్రభుత్వం ఈ పునరావాస పథకాన్ని ప్రకటించింది. దాని కింద మొదటగా 5 వేల మందికి పునరావాసం కల్పించనుంది. అక్కడి ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఆ సంఖ్యను 20 వేలకు పెంచింది. అత్యంత ప్రమాదంలో ఉన్న వారికే ఇందులో ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొంది.