కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ వెల్లడి
న్యూఢిల్లీ : పిఎం ఆయుష్మాన్ భారత్ వ్యవస్థ కింద అన్ని వైద్య సౌకర్యాలతో రెండు కంటైనర్ మొబైల్ ఆస్పత్రులను త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం వెల్లడించారు. అత్యవసర వైద్య సేవల కోసం ఇవి దేశంలో ఎక్కడికైనా వెళ్ల గలవని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ , చెన్నైలో ఉండే వీటిలో ఒక్కో కంటైనర్లో వంద పడకలు ఉంటాయని, ఎక్కడ అత్యవసర వైద్యం అందించవలసి ఉందో అక్కడకు విమానాలు లేదా రైళ్ల ద్వారా కూడా వీటిని తీసుకు వెళ్ల వచ్చని చెప్పారు. వైద్య సదుపాయాలను విస్తరింప చేయవలసిన అవసరాన్ని కరోనా మహమ్మారి కల్పించిందని, ఈమేరకు పిఎం ఆయుష్మాన్ భారత్ వైద్య ఆరోగ్య సదుపాయాల మిషన్ ను రూ. 64,000 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. కొవాగ్జిన్ కు అత్యవసర వినియోగానికి సంబంధించి మంగళవారం డబ్లుహెచ్ఒ సాంకేతిక కమిటీ సమావేశమై నిర్ణయిస్తుందని చెప్పారు. పిల్లల వ్యాక్సిన్ జై కొవ్ డి ధర నిర్ణయం ఇంకా చర్చలో ఉందన్నారు.
కరోనా కొత్త వేరియంట్ ఎవై .4.2 పైన, ఇతర వేరియంట్లపై ఐసిఎంఆర్, ఎన్సిడిసి అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. దేశంలో ఏర్పాటు చేయాలనుకున్న 1.5 లక్షల హెల్త్, అండ్ వెల్నెస్ సెంటర్లలతో 79,415 సెంటర్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయి అయినా, జాతీయ స్థాయి అయినాసరే అన్నిస్థాయిలో ఉత్తమమైన లేబొరేటరీలు అవసరమని, ఈమేరకు ఒక జిల్లాలో వైద్యసౌకర్యాల విస్తరణకు ఆయుష్మాన్ భారత్ మిషన్ కింద రూ. 90 నుంచి రూ. 100 కోట్ల వరకు ఖర్చుచేయడమౌతుందని వివరించారు. ఇదే పథకం కింద జిల్లా స్థాయిలో ఉచితంగా 134 రకాల పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వైద్య ఆరోగ్య సౌకర్యాల పటిష్టతకు నేషనల్ హెల్త్మిషన్కు అదనంగా ఆయుష్మాన్ భారత్ మిషన్ దేశంలో పెద్ద స్కీమ్గా అభివర్ణించారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వైద్యసౌకర్యాల లోపాలను ఈ పధకం భర్తీ చేస్తుందని చెప్పారు. ఇది 17m788 గ్రామీణ, 10 ముఖ్యమైన రాష్ట్రాల్లోని వెల్నెస్ సెంటర్లకు మద్దతు ఇస్తుందని ఇదికాక అన్ని రాష్ట్రాల్లో 11,024 అర్బన్ హెల్త్ , వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయడమౌతుందని చెప్పారు. వీటివల్ల కీలక మైన వైద్య సౌకర్యాలు దేశం లోని అన్ని జిల్లాలకు అందుతాయని, ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ ఆస్పత్రుల ద్వారా ఐదు లక్షల మందికి మిగతా జిల్లాలకు రిఫరల్ సర్వీసుల ద్వారా వైద్యం అందుతుందని వివరించారు.
నేషనల్ హెల్త్ మిషన్ పథకం విస్తరణ
నేషనల్ హెల్త్ మిషన్ పధకం విస్తరణ గురించి మిషన్ డైరెక్టర్ వికాస్ షీల్ వివరిస్తూ మొత్తం 730 జిల్లాల్లో సమగ్ర ప్రజారోగ్య లేబొరేటరీలు, రాష్ట్రస్థాయిలో ఐదు రీజినల్ బ్రాంచిలు, జాతీయ స్థాయిలో 20 ఎస్సిడిసి (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ) మెట్రోపాలిటన్ యూనిట్లు ఏర్పాటు చేసి ఎన్సిడిసిని మరింత పటిష్టం చేయడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. 12 ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ ఆస్పత్రుల బ్లాక్లతోపాటు రాష్ట్రస్థాయిలో 24 గంటలూ పనిచేసే 15 హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు కూడా త్వరలో ప్రారంభమౌతాయని వివరించారు.