ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడి
టోక్యో : జపాన్ పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాని ఫ్యూమిమో కిషిడా అధికార సంకీర్ణ పార్టీనే విజయం సాధించే అవకాశం ఉంది. జపాన్కు చెందిన ఎన్హెచ్కె అధికారిక టెలివిజన్ ఎగ్జిట్ పోల్లో ఈ విశ్లేషణ వెలువడింది. 465 స్థానాల పార్లమెంట్ దిగువసభకు ఆదివారం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలలో అధికారిక లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ , అనుబంధ భాగస్వామ్య పక్షం కొమియిటో కలిసి 239 నుంచి 288 స్థానాలు దక్కించుకుంటాయని అధికారిక టీవీ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. అధికార సంకీర్ణానికి కొన్ని సీట్లు తగ్గుతాయని, అయితే అధికారం ఖాయం అని తేల్చారు. ఇప్పటి వరకూ సంకీర్ణానికి 305 స్థానాల బలం ఉంది. అయితే దీనికి ఇప్పుడు గండి పడే అవకాశాలు ఉండటంతో ఇటీవలే అధికార పగ్గాలు చేపట్టిన కిషిడాకు క్రమేపీ ఎదురుగాలి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీనే అధికార పార్టీలో జరిగిన నాయకత్వ పోటీలో తన పట్టు సాధించుకున్నారు. ప్రధాని అయ్యారు. అయితే మరింత పార్టీలో మరింత సుస్థిర స్థానం దక్కించుకునేందుకు ఆయన కేవలం పది రోజులే అధికారంలో ఉండి దిగువ సభను రద్దు చేశారు. ఎన్నికలకు వెళ్లారు.