Tuesday, April 30, 2024

మద్యం విందు.. గంజాయి తేలేదని యువకుడి హత్య

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఇందల్‌వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన నవీసాబ్ గత నెల 24న అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన ఇందల్‌వాయి పోలీసులు హత్య కేసులో ఉన్న మిస్టరీని చేధించారు. ఈమేరకు నిజామాబాద్ ఎసిపి కిరణ్‌కుమార్ శుక్రవారం ఏర్పాటు చేసిన వలేకరుల సమావేశంలో ఈ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఈసమావేశంలో డిచ్‌పల్లి సిఐ కృష్ణ, ఎస్సై నరేష్‌లు ఉన్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సింకిందర్, రోహిత్, ధర్మేంద్రలు రెండేళ్ళ క్రితం బతుకు దెరువు కోసం ఇందల్‌వాయికి వచ్చారు. సమీపంలోని తిర్మన్‌పల్లి శివారులో ఉన్న విశ్వ అగ్రోటెక్ సంస్థలో పని చేస్తున్నారు. ఇందల్‌వాయి శివారులోనే ఒక అద్దె ఇంట్లో కిరాయికి ఉంటున్న వారు అదె గ్రామానికి చెందిన నవీసాబ్‌తో పాటు మోపాల్ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన జావిద్‌కు పరిచయం అయ్యింది. వీరంతా కలిసి తరచూ విందులు చేసుకునే వారు ఈ క్రమంలోనే గత నెల 24న ఇందల్‌వాయి శివారులో మద్యం విందు ఏర్పాటు చేసుకున్నారు.

చిత్తుగా తాగిన వారికి గంజాయి తాగాలనే కుతూహలం కలిగింది. జిల్లాలో గంజాయి ఎక్కడ దొరుకుతుందని, ఎంత ఖర్చు అయినా తమకు కావాలంటూ అడిగారు. నర్సింగ్‌పల్లికి చెందిన జావిద్ గంజాయి అమ్మే అడ్డాలు తనకు తెలుసు అని నమ్మబలిగాడు. దీంతో బీహార్‌కు చెందిన ముగ్గురు యువకులు గంజాయి కోసం జావిద్‌క వెయ్యి రూపాయలు ఇచ్చారు. వారంతా కలిసి గాంధారి చౌరస్తా వైపు గంజాయి కోసం వెళ్ళారు. ఇంతలోనే జావిద్ వారందరి కళ్ళుగప్పి జావిద్ మాయమయ్యాడు. దీంతో ఆగ్రహించిన బీహారీలు జావిద్ స్నేహితుడైన నవీసాబ్‌ను అక్కడే చితకబాదారు. గంజాయికి కోసం తీసుకున్న డబ్బును తమకు వాపసు ఇవ్వాలని జావిద్‌ను పట్టి ఇవ్వాలని నవీసాబ్‌ను తమ రూమ్‌కు తీసుకెళ్లి తాళ్ళతో కట్టేసి కొట్టారు. తమ వద్ద ఉన్న తంపచా తుపాకీతో నవీ తలమీద గట్టిగా కొట్టడంతో స్పహృ కోల్పోయాడు.

దీంతో అతని రూమ్‌ లోంచి కాలు పట్టుకుని ఈడ్చుకుంటు తీసుకెళ్లారు. ఇందల్వాయి శివారులోని బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసి పారిపోయారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. డిచ్‌పల్లి సిఐ కృష్ణ, ఇందల్‌వాయి ఎస్సై నరేష్‌లు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నవీసాబ్ మృతిన హత్యేనని నిర్దారణకు వచ్చారు. నిందితులు బీహార్‌కు పారిపోవడానికి సిద్దమై రైల్వే స్టేషన్‌కు వెళ్ళగా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో హుటాహుటినవెళ్లి సికిందర్, ధర్మేంద్రలను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నవీసాబ్‌ను తామే హత్య చేశామని నిందితులు అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన తంపచా తుపాకీతో పాటు బుల్లెట్ స్వాధీనం చేసుకున్నట్లు ఎసిపి కిరణ్‌కుమార్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News