Saturday, May 4, 2024

కరోనా మూడో ముప్పు?

- Advertisement -
- Advertisement -
Aiims says Corona Third Wave has started
ఈ నెల నుంచి క్రమంగా పెరిగి
-జనవరి, -ఏప్రిల్ మధ్య తీవ్రస్థాయికి
-జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం
మా లెక్కలు ఎప్పడూ తప్పలేదు :- ఎయిమ్స్

హైదరాబాద్ : కరోనా మూడో ముప్పు మొదలైనట్లు వెలువడుతున్న సంకేతాలు అందరినీ కలవరపెడుతున్నాయి. కొవిడ్ ఈ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి వచ్చే ఏడాది జనవరి- ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్టా ప్రజలు కచ్చితంగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఎయిమ్స్ ఆరోగ్య గణాంక నిపుణులు హెచ్చరించారు. దేశంలో టూరిస్ట్‌ల సంఖ్య పెరగడం, సభలు, సమావేశాలతో ప్రజలు గుమిగూడటం తదితర కారణాలు మూడో ఉద్ధృతికి దారి తీయొచ్చని తెలిపారు. ఇటీవల టూరిస్ట్‌లు పెరిగిన మనాలి, డార్జిలింగ్ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆంక్షలను పాటించకపోతే మూడో ఉద్ధృతి పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. భారత్‌లో మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసులు 103 శాతం వరకూ ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు. కొవిడ్ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా, పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుందని తెలిపారు. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

భౌతికదూరం పాటించకపోతే కేసులు పెరిగే అవకాశం

భౌతికదూరం పాటించకపోతే కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం, షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం వంటి పనులతో కరోనా ముప్పు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పర్యాటకులు పెరిగి స్థానిక వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందేమో కానీ కొవిడ్ పట్ల టూరిస్ట్‌లు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. దేశానికి మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ సూచించారు. కొవిడ్ అంశంపై తమ నిపుణులు పేర్కొన్న గణాంకాలు ఇప్పటివరకు తప్పలేదని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని చెప్పారు.

డబ్లూహెచ్‌ఒ హెచ్చరిక

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఒ) మరోసారి హెచ్చరిక జారీ చేసింది. కరోనా ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, ఆ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడలేదు అని స్పష్టం చేసింది. గత వారం ప్రపంచ వ్యాప్తంగా 31 లక్షల మందికి కరోనా సోకగా, 54 వేల మంది మరణించినట్లు తెలిపింది. కొన్ని దేశాల్లో ఆసుపత్రులు నిండిపోతున్నాయని పేర్కొంది. కొందరేమో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారని తెలిపింది. ఈ రెండేళ్లలో కరోనా కాటుకు 50 లక్షల మంది బలయ్యారు అని పేర్కొంది. టీకా తీసుకోని వారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని, కరోనా విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త ఉండటం మంచిది కాదని అని డబ్లూహెచ్‌ఒ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News