ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
హాజరుకానున్న అన్ని రాష్ట్రాల స్పీకర్లు, చైర్పర్సన్లు
గాంధీనగర్: లోక్సభ, రాజ్యసభ, ఇతర శాసన వ్యవస్థలకు చెందిన సభాధ్యక్షుల మధ్య విస్తృత సంప్రదింపులకు అవకాశం కల్పించే లక్షంతో రెండు రోజులపాటు జరిగే 80వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశం బుధవారం గుజరాత్లోని నర్మదా జిల్లా కేవడియా వద్ద ఉన్న ఐక్యతా విగ్రహం సమీపంలో బుధవారం ప్రారంభం కానున్నది. స్పీకర్ల సమావేశంగా కూడా వ్యవహరించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభిస్తారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం నాడిక్కడ విలేకరులకు తెలిపారు.
1921లో ప్రారంభమై ప్రస్తుతం శత సంవత్సరంలో ఉన్న స్పీకర్ల సమావేశానికి ఓం బిర్లా చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య సామరస్యపూర్వక సమన్వయం-శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి కీలక అనే అంశంపై ఈ సమావేశం జరగనున్నది.
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడుతోపాటు గుజరాత్, రాజస్థాన్ గవర్నర్లు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఈ సమావేశానికి హాజరవుతారని బిర్లా తెలిపారు. లోక్సభలో కాంగ్రెస్ సభా నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభలు, మండళ్లకు చెందిన సభాధ్యక్షులు ఈసమావేశంలో పాల్గొంటారు. సమావేశాల ముగింపు రోజు గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో సమావేశానికి హాజరైన ప్రతినిధులు రాజ్యాంగ పీఠికను పఠిస్తారని బిర్లా చెప్పారు.
రెండు రోజుల సమావేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, పార్లమెంటరీ, అసెంబ్లీల కార్యకలాపాలు ప్రసారం చేయడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనిఒకే వేదికపై ఉపయోగించడం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. అదే విధంగా వాగ్వివాదాలు, రభస సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాలకు ఎటువంటి అవరోధం కలగకుండా తీసుకోవలసిన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని బిర్లా చెప్పారు.
ఉత్తరాఖండ్లో జరిగిన గత సమావేశంలో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంతోసహా మూడు అంశాల గురించి చర్చించామని, రాజస్థాన్ శాసనసభ స్పీకర్ సిపి జోషి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశామని, ప్రస్తుత సమావేశంలో కమిటీ నివేదికపై చర్చిస్తామని ఓం బిర్లా తెలిపారు.
సమావేశాల ప్రధాన అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యానికి మూడు స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు రాజ్యాంగంలో వేర్వేరుగా హక్కులు కల్పించడం జరిగిందని, ఈ మూడు వ్యవస్థలు తమ పరిధులలో పనిచేస్తూ సమిష్టిగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సి ఉంటుందని బిర్లా చెప్పారు.