కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి
పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇండస్ట్రీయల్ పార్క్లో ఉన్న అన్ని పరిశ్రమలు నడుపుకోవచ్చని వీటికి ఏవిధమైన అనుమతులు, అఫిడవిట్స్ సమర్పిం చాల్సిన అవసరం లేదని పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సూచించారు. తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఈవి నరసింహ రెడ్డి, ఎండి, టిఎస్ఐఐసి, తెలంగాణ ప్రారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) అధ్యక్షుడు కె. సుధీర్ రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఇండస్ట్రీయల్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు, సర్వీస్ సొసైటీ చైర్మన్లు, సీనియర్ పారిశ్రామికవేత్తలు, ప్రోడక్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సుమారు 300 మంది ఈ వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్నారు. మూడురోజుల క్రితం చీఫ్ సెక్రటరీ సోమేష్కుమార్ పరిశ్రమలను ప్రారంభించుకోవచ్చని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ మాట్లాడుతూ ఇండస్ట్రీయల్ పార్క్లో కాకుండా మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పరిశ్రమలు సంబంధిత డిఐసిల నుంచి పర్మిషన్ తీసుకొని కార్మికులకు పరిశ్రమల్లో బస ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి
పరిశ్రమలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదని, కంటిన్యూ ప్రాసెస్ ఉన్నవాళ్లు కార్మికులను సాయంత్రం ఆరుగంటల లోపు పరిశ్రమలకు అనుమతించి ఉదయం ఆరుగంటల తర్వాత మాత్రమే బయటకు పంపే విధంగా ఏర్పాట్లు చేసుకుంటే ఇంకో షిఫ్ట్ నడుపుకోవచ్చని ఆయన తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని జయేశ్రంజన్ సూచించారు.
ప్రస్తుతం కేవలం పరిశ్రమలకే అనుమతి ఇవ్వడం జరిగిందని, ఎలాంటి ఇతర వాణిజ్య సంస్థలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. గూడ్స్ ట్రాన్స్ఫోర్ట్కు సంబంధించి ట్రాన్స్పోర్ట్ వెహికల్తో పాటు సంబంధించిన బిల్లు, డిసి ఉన్నట్లయితే పోలీసు అధికారులు, ఇతర గవర్నమెంట్ అధికారులు ఎవరూ కూడా వాహనాలను ఆపరని ఆయన తెలియజేశారు. ఎవరైనా అధికారులు ఇబ్బందులు పెట్టినట్లయితే దీనిని పరిష్కరించడానికి నోడల్ అధికారిగా కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి అడిషనల్ డైరెక్టర్ రాజ్కుమార్ నియమించామని, ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.