Saturday, April 27, 2024

మణిపూర్‌పై అఖిలపక్ష భేటీ

- Advertisement -
- Advertisement -

అగ్గిరగులుకున్న 50 రోజులకు
మణిపూర్‌పై అఖిలపక్ష భేటీ
అంతాకలిసి రాష్ట్రానికి వెళ్లాలి
విపక్షాల డిమాండ్, సిఎం బర్తరఫ్‌కు పట్టు
రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్‌పి పిలుపు
న్యూఢిల్లీ: మణిపూర్ మంటల తరువాత మూడ్నెళ్లకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. పరిస్థితిపై సమీక్షించేందుకు శనివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు మణిపూర్ విషయంలో కేంద్రం తాత్కార ధోరణి పరిస్థితిని దిగజార్చిందని విమర్శించాయి. ముందుగా మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం తరఫున అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని విపక్షాలు కోరాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ఇప్పటి భేటీలో విస్తృతస్థాయిలో చర్చించారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మే 3 నుంచి ఆగకుండా హింసచెలరేగుతున్న ఈ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని సమాజ్‌వాదీపార్టీ ఇతర పార్టీలు కోరారు.

రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం శాయశక్తులా యత్నిస్తోందని విపక్షాలకు ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు పరిస్థితిపై సరైన రీతిలో తెలుసుకుంటున్నారని, ప్రధాని ఆదేశాల మేరకు శాంతి పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపిందని భేటీ తరువాత బిజెపికి చెందిన మణిపూర్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సంబిత్ పాత్ర విలేకరులకు తెలిపారు. వ్యవహారంపై ప్రధాని మోడీ స్పందించడం లేదనడం సరికాదని అమిత్ షా తెలిపారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ సూచనలు వెలువరించడం, తాను ప్రధానికి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియచేయడం జరుగుతోందని, ఇది జరగని రోజు లేనేలేదన్నారు. అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్, బిజెపి, టిఎంసి, ఆప్, వామపక్షాలు, డిఎంకె ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు.

మయన్మార్ వెంబడి పదికిలోమీటర్ల కంచె
ఇతర శక్తులు హింసాకాండను రెచ్చగొడుతున్నాయనే అనుమానాలతో మయన్మార్ సరిహద్దు వెంబడి చొరబాట్లు అరికడుతున్నట్లు అమిత్ షా తెలిపారు. 10 కిలోమీటర్ల పొడవైన కంచెను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇతరత్రా కట్టడి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు, ఎక్కువగా చొరబాటుదార్లలో యువతనే ఉన్నారని, వీరు ఇప్పుడు అధికారుల ముందు ఆయుధాలతో సరెండర్ అయ్యారని వివరించారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి సరైన సలహాలు సూచనలు, ప్రతిపాదనలు తీసుకుని, సముచిత రీతిలో పరిష్కారానికి కేంద్రం ముందుకు వెళ్లుతుందన్నారు. పాట్నాలో జరిగిన విపక్ష భేటీ తరువాత 24 గంటల్లోనే మణిపూర్‌పై అఖిలపక్ష భేటీ జరిగింది.

మణిపూర్‌పై , ఈశాన్య భారతంపై ప్రతిపక్షాలది ఒకటే మాటగా ఉందని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో మూడు గంటల పాటు జరిగిన భేటీ తరువాత టిఎంసి నేత ఒబ్రెయిన్ విలేకరులకు తెలిపారు. అఖిలపక్షాన్ని అక్కడికి తీసుకువెళ్లాలి, ముఖ్యమంత్రిని బర్తరప్ చేయాలనేదే ప్రతిపక్షాల డిమాండ్ అని వివరించారు. మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడానికి పూర్తి బాధ్యత కేంద్రానిదే అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ సమావేశానికి కేంద్రం తరఫున మంత్రులు ప్రహ్లాద్ జోషీ, నిత్యానంద రాయ్ , అజయ్‌కుమార్ మిశ్రా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దెకా కూడా హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News