ముంబై : టీమిండియాలో మళ్లీ చోటు అవకాశాలు సురేశ్ రైనాకు ఇంకా మిగిలే ఉన్నాయని భారత క్రికెటర్ అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. రైనాలో ఇంకా అపార క్రికెట్ దాగివుందన్నాడు. రానున్న రోజుల్లో అతను భారత జట్టులో స్థానం సంపాదించడం ఖాయమన్నాడు. ఈసారి ఐపిఎల్ జరిగి ఉంటే రైనాతో పాటు చాలా మంది సీనియర్లకు టీమిండియాలో తిరిగి స్థానం సంపాదించే అవకాశాలు చాలా ఉండేవన్నాడు. ఇక, చాలా మ్యాచుల్లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత రైనాకు ఉందన్నాడు. మరి కొన్నేళ్ల పాటు భారత్కు ప్రాతినిథ్యం వహించే సత్తా రైనాకు ఉందని, వచ్చే ప్రపంచకప్లో అతను జట్టులో చోటు సంపాదించినా ఆశ్చర్యం లేదన్నాడు. అపార ప్రతిభావంతుడైన రైనాకు వన్డేల్లో, టి20లలో మంచి రికార్డు ఉందన్నాడు. ఒత్తిడిలోనూ మెరుగ్గా ఆడడంలో రైనా మంచి పేరు తెచ్చుకున్నాడన్నాడు. తన దృష్టిలో మాత్రం రైనా మళ్లీ భారత జట్టుకు ప్రాతినిథ్యంవహించడం ఖాయమని రాయుడు ధీమా వ్యక్తం చేశాడు.