సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో చర్చలు
న్యూఢిల్లీ : ఢిల్లీ సరిహద్దుల్లో రోజురోజుకూ ఉధృతమౌతున్న రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హెం మంత్రి అమిత్షా గురువారం మిగతా కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, పీయూష్ గోయెల్, నరేంద్రసింగ్ తోమర్ తదితరులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. బిజెపి కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటైంది. పార్టీ జనరల్ సెక్రటరీలు సిటి రవి, దుష్యంత్ గౌతమ్ ,అరుణ్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు. రైతుల ఆందోళనపై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలుపు చేసే అంశం పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఇప్పుడు జరుగుతున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ ఈ సమస్యపై మాట్లాడుతూ సమస్య త్వరగా పరిష్కారం కావాలని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించారు. పంచాయత్తో చర్చించిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని, నగరాన్ని దిగ్బంధించే హక్కు రైతులకు లేదని సుప్రీం కోర్టు చెప్పడాన్ని సమర్ధించారు. నిరసన కారులు రోడ్లను దిగ్బంధించలేదని, పోలీసులే రోడ్లపై బారికేడ్లను పెట్టారని తెలిపారు. చర్చలకు ఆహ్వానిస్తే తాము పాల్గొంటామన్నారు. ఈ చట్టాలను సవరించడానికి ప్రభుత్వం ముందుకొస్తోందని, కానీ తాము వాటిని రద్దు చేయాలని కోరుతున్నామని చెప్పారు.
రైతులకు వ్యవసాయ మంత్రి లేఖ
కనీస మద్దతు ధర (ఎంఎస్పి)పై కొంతమంది ప్రచారం చేసే అబద్ధాలు నమ్మ వద్దని, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఎంఎస్పిపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. కొన్ని రైతు సంఘాలు వదంతులు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి వారిని బయటకు పంపడం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తన బాధ్యతగా మంత్రి లేఖలో వివరించారు. రైలుపట్టాలపై కూర్చుని రైళ్లను ఆపుతున్నందున మన సైనికులు సరిహద్దులకు చేరుకోలేక పోతున్నారని తోమర్ పేర్కొన్నారు.