Sunday, April 28, 2024

సిఎఎని అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు

- Advertisement -
- Advertisement -

సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదు
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సిఎఎని రాష్ట్రాలు అడ్డుకోలేవని, పౌరసత్వాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వమే అనుమతించగలదని కూడా ఆయన తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సిఎఎపై ఒక ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో అమిత షా అనేక సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు. సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదని, మన దేశంలో భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వాలన్న నిర్ణయం పార్లమెంట్ తీసుకున్నదని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

సిఎఎపై మైనారిటీలు కాని ఇతరులు ఎవరైనా కాని భయపడాల్సిన అవసరం లేదని, ఎవరి పౌరసత్వాన్ని తొలగించే నిబంధన ఏదీ సిఎఎలో లేదని ఆయన తెలిపారు. అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు చెందిన హిండూ, బౌద్ధ, జైన, సిక్కు, క్రైస్తవ, పార్శీ శరథార్థులకు హక్కులు, పౌరసత్వాన్ని ఇచ్చేందుకు సిఎఎ ఉందని ఆయన అన్నారు. సిఎఎ ద్వారా కొత్త ఓటు బ్యాంకును బిజెపి సృష్టిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణపై స్పందిస్తూ ప్రతిపక్షాలకు వేరే పనేమీ లేదని, చెప్పింది చేసే అలవాటు వారికి లేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు కూడా రాజకీయ లబ్ధి కోసం చేసిందేనని వారు(ప్రతిపక్షాలు) చెప్పారని, కాని 1950 నుంచి తాము 370వ అధికరణను రద్దు చేస్తామని చెబుతున్నామని అమిత్ షా తెలిపారు.

సిఎఎ అమలుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రకటించాల్సి వచ్చిందన్న ప్రతిపక్షాల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీతోసహా ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ అసత్యాల రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సిఎఎ అమలును ఉద్దేశపూర్వకంగా ఇప్పుడే చేశామనడం అసత్యమని ఆయన తెలిపారు. సిఎఎని అమలుచేసి అప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు చెందిన శరణార్థులకు భారతీయ పౌరసత్వాన్ని ఇస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే బిజెపి చెప్పిందని ఆయన గుర్తు చేశారు. 2019లో దీన్ని పార్లమెంట్ ఆమోదించిందని, అయితే కొవిడ్ కారణంగా అమలులో జాప్యం జరిగిందని ఆయన వివరించారు. బుజ్జగింపు రాజకీయాలు చేసి తమ ఓటు బ్యాంకును పదిలపరుచుకోవాలని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయని ఆయన అన్నారు.

వాటి బండారం బయటపడిందని, సిఎఎని ఈ దేశ చట్టంగా ప్రజలు గుర్తించారని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు సిఎఎని అమలు చేస్తామని తాను గత నాలుగేళ్లలో 41 సార్లు చెప్పానని హోం మంత్రి అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై అమిత్ షా మండిపడ్డారు. కేజ్రీవాల్ మతిస్థిమితం కోల్పోయారని ఆయన ఆరోపించారు. శరణార్థులకు పౌరసత్వం ఇస్తే చోరీలు, అత్యాచారాలు పెరిగిపోతాయంటూ కేజ్రీవాల్ చేసిన ప్రకటనను ఆయన తప్పుపట్టారు. తన అవినీతి బయటపడడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి మతిస్థిమితం కోల్పోయారని ఆయన విమర్శించారు. వీరంతా(శరణార్థులు) ఇప్పటికే ఇక్కడకు వచ్చి నివసిస్తున్నారన్న విషయం ఆయనకు తెలియదని, ఆయనకు అంత ఆందోళనే ఉంటే బంగ్లాదేశీ చొరబాటుదారులు లేదా రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఎందుకు మట్లాడడం లేదని అమిత్ షా ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

దేశ విభజన నేపథ్యం గురించి ఆయన మరచిపోయారని, శరణార్థ కులుంబాలను ఆయన కలుసుకుంటే మంచిదని హోం మంత్రి సూచించారు. సిఎఎ నోటిఫికేషన్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పశ్చిమ బెంగాల్‌లో బిజెపి అధికారంలోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని, అప్పుడు చొరబాట్లను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. జాతీయ భద్రతకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్య మీద ఇటువంటి రాజకీయాలు చేయడం తగదని ఆయన అన్నారు. బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ చొరబాట్లను అనుమతిస్తున్నారని, శరణార్థులకు భారతీయ పౌరసత్వం రావడాన్ని వ్యతిరేకిస్తున్నారని, ఇలా చేయడం వల్ల మమతను ప్రజలు విశ్వసించబోరని ఆయన అన్నారు. శరణార్థికి చొరబాటుదారునికి మధ్య తేడా మమతకు తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలలో సిఎఎ అమలు గురించి కూడా అమిత్ షా మాట్లాడారు.

సిఎఎని తమ రాష్ట్రాలలో అమలు చేయబోమంటూ కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావిస్తూ రాజ్యాంగంలోని 11వ అధికరణ కింద పౌరసత్వానికి సంబంధించిన సర్వాధికారాలు పార్లమెంట్‌కే ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే తప్ప రాష్ట్ర పరిధిలోనిది కానది ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు సహకరిస్తాయని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. గిరిజన ప్రాంతాల కూర్పును సిఎఎ మారుస్తుందా అన్న ప్రశ్నకు అణువంత కూడా మార్చబోదని ఆయన స్పష్టం చేశారు.

సిఎఎ వల్ల గిరిజన ప్రాంతాల కూర్పు కాని, హక్కులు కాని ఏమాత్రం మారవని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చిన ప్రాంతాలలో సిఎఎ వర్తించదని ఆయన తెలిపారు. ఆ ప్రాంతాలలోని చిరునామాలు యాప్‌లో అప్‌లోడ్ కావని, వాటిని యాప్ నుంచి మినహాయించామని ఆయన తెలిపారు. పార్లమెంట్‌లో ఆమోదించిన ఐదేళ్ల తర్వాత సిఎఎని గత సోమవారం కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మరి కొద్ది రోజులలో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందు ఈ నోటిఫికేషన్ వెలువడడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News