దేవరియా: రేప్ కేసులో నిందితుడికి ఎంఎల్ఎ టికెట్ ఇవ్వొద్దన్నందుకు కాంగ్రెస్ మహిళా కార్యకర్తపై ఆ పార్టీకి చెందిన కొందరు దాడికి పాల్పడ్డ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. ఓవైపు హత్రాస్ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని పోరాడుతూ మరోవైపు రేపిస్ట్కు పార్టీ టికెట్ ఎలా ఇస్తారని తాను ప్రశ్నించానని దాడికి గురైన మహిళా కార్యకర్త తారాదేవి యాదవ్ తెలిపారు. దేవరియా ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తల అంతర్గత సమావేశంలో ఈ సంఘటన జరిగింది. ఆమెపై కొందరు పిడిగుద్దులు కురిపిస్తూ నెట్టివేస్తున్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఇద్దరు కార్యకర్తలు ఆమెకు రక్షణ కల్పిస్తూ పక్కకు తీసుకువెళ్లారు. బిజెపి ఎంఎల్ఎ మరణంతో ఖాళీ ఏర్పడగా జరుగుతున్న ఉప ఎన్నిక కోసం ముకుంద్ భాస్కర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ప్రకటించారు. రేప్ కేసులో నిందితుడైన ముకుంద్కు టికెట్ ఎలా ఇస్తారని తారాదేవి ప్రశ్నించారు. నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తాను డిమాండ్ చేశానని ఆమె తెలిపారు. తనను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.