పద్మ పురస్కారంపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా 2020 సంవత్సరానికి గాను పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. వాణిజ, పారిశ్రామిక రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం..దేశ మూడో అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. అయితే ఈ అవార్డుకు తాను అనర్హుడినని అనిపిస్తోందని ఆనంద్ మహీంద్రా అంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేశారు.‘ ఈ ప్రభుత్వం పద్మ పురస్కార గ్రహీతల ఎంపికలో పరివర్తనమైన మార్పులు చేసింది. ఇప్పుడు అట్టడుగు స్థాయిలలో సమాజాభివృద్ధికోసం కృషి చేస్తున్న వారిపై ఎక్కువ దృష్టి పెట్టింది. అలాంటి గొప్పవారి పక్కన ఈ పురస్కారం తీసుకునేందుకు నేను నిజంగా అనర్హుడిగా భావిస్తున్నా’ అని మహీంద్రా రాసుకొచ్చారు.
వేల సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకోసం కృషి చేసిన తులసి గౌడను కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిన విషయం తెలిసిందే. ఆమె అవార్డు అందుకొంటున్న ఫొటోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ఈ వ్యాఖ్యలు చేశారు. తులసి గౌడతో పాటుగా పండ్లు అమ్ముకొంటూ పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించిన హరేకల హజబ్బాకు కూడా సోమవారం పద్మశ్రీ అవార్డును అందించారు. కాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్కు నెటిజన్లనుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ మీ నిజాయితీ చాలా గొప్పది సర్. కానీ మీరు కూడా ఈ సమాజం కోసం ఎంతగానో సేవ చేస్తున్నారు. ఓ గొప్ప పారిశ్రామిక వేత్తగా మీరు ఎప్పటికీ గుర్తుండితారు’ అంటూ నెటిజన్లు కొనియాడారు.
This Govt has made a long-overdue, transformational shift in the texture of the Padma Awards recipients. Now, the focus is largely on individuals making seminal contributions to the improvement of society at grassroots levels. I truly felt undeserving to be amongst their ranks. https://t.co/jor34tqx1w
— anand mahindra (@anandmahindra) November 9, 2021