హైదరాబాద్: నగరంలో పేదల వైద్యానికి భరోసా ఇచ్చే బస్తీదవాఖానలను దశలవారీగా పెంచుతూ త్వరలో మరో 15 దవాఖానలు వైద్యశాఖ అధికారులు సిద్ధం చేశారు. వచ్చే నెల నుంచి రోగులకు సేవలందించే జిహెచ్ఎంసి అధికారులతో కలిసి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. కాంట్రాక్టు పద్దతిలో నియామకం చేపట్టే సిబ్బందిలో సగంమంది బస్తీదవఖానలో సేవలందించేందుకు నియమిస్తున్నట్లు పేర్కొంటున్నారు. గత నాలుగేళ్ల నుంచి గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 224 బస్తీదవాఖానలు పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుండగా, కొత్త ఏర్పాటు చేస్తే ప్రైవేటు ఆసుపత్రులకు ప్రజలు వెళ్లే అవసరంలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న దవఖానలు రోజుకు 80 మంది నుంచి 100మంది వరకు చికిత్స చేస్తున్నారు. అదే విధంగా ఆసుపత్రులకు వెళ్లేవారికి ల్యాబ్ పరీక్షల సమస్యల ఉంటే ఇటీవలే ప్రభుత్వం 08 మిని డయాగ్నస్టిక్ హబ్లు ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహిస్తున్నారు.
బస్తీ దవఖానలో ఒక డాక్టరు,నర్సు,కాంపౌండర్ సేవలందిస్తూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉండటంతో దగ్గు,జలుబు,జ్వరం లక్షణాలున్న వారంతా బస్తీదవాఖానల్లో గంటల తరబడి ఉంటూ వివిధ రకాలు పరీక్షలు చేయించుకుని కావాల్సిన మందులు తీసుకుంటున్నారు. గ్రేటర్ నగరంలో లక్ష జనాభాకు ఒక దవాఖాన ఏర్పాటు చేస్తామని గతంలో సిఎం కేసీఆర్ ప్రకటించి, ప్రతి డివిజన్కు రెండు చొప్పను 300 ఏడాదిలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 239 బస్తీ దవాఖానలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రోగులకు 200రకాల మందులు, 60 రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా మలక్పేట, సంతోష్నగర్, చాంద్రాయణగుట్ట, బహదూర్పురా,ఉప్పగూడ, చార్మినార్, మెహిదిపట్నం, యాకుత్పురా, డబీర్పురా,ముషీరాబాద్, అడ్డగుట్ట వంటి చోట్ల ఏర్పాటు చేసిన బస్తీదవాఖానకు రోగుల రద్దీ ఎక్కువ ఉందని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
ఈఏడాది సీజనల్ వ్యాధులను వైద్య సిబ్బంది సులువుగా ఎదుర్కొని పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. త్వరలో శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే చేసే విధంగా ఆపరేషన్ థియేటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రతి రోగికి వైద్యం సేవలందిస్తామని సిబ్బంది భరోసా కల్పిస్తున్నారు. వైద్యశాఖ ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా బస్తీదవఖానల్లో వైద్యం చేయడంపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.