హైదరాబాద్ : దుర్గామాతా విగ్రహంతో పాటు కోటి రూపాయల విలువ చేసే నాగమణి రాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేసినట్లు నగర కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. మంగళవారం కమిషరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జియాగూడకు చెందిన దేవేందర్ అలియాస్ దేవా(40), కూకట్పల్లికి చెందిన టి.జాన్ (66), కార్వాన్కు చెందిన మహ్మద్ ఆస్రఫ్ (23), రాంకోఠికి చెందిన ప్రేమ్చంద్ గుప్తా(38)లు ఉన్నట్లు పేర్కొన్నారు. దేవేందర్ మూడేళ్ల కితం ముంబైలో ఓగుర్తు తెలియని వ్యక్తి నుంచి నాగమణి రాయిని కొనుగోలు చేశారు. ఈక్రమంలోనే విగ్రహంతో పాటు నాగమణి రాయిని అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరివద్ద లభించిన దుర్గామాత విగ్రహం, నాగమణి రాయి పంచలోహం కాదని నకిలీవని తేలినట్లు స్పష్టం చేశారు.