మన తెలంగాణ/హైదరాబాద్ :పార్టీ కోసం కష్టపడితే పార్టీ వారిని గుర్తించి గౌరవిస్తుందని టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి చెప్పారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలు కౌన్సిలర్ రాజేందర్, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్, మోహన్ నాయక్, అమీర్ జావిడ్లను ఆదివారం టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి పరామర్శించారు. నిరుద్యోగ, విద్యార్థి జంగ్ సైరన్ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీఛార్జి జరిగింది. ఈ లాఠీచార్జిలో గాయపడిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా పలువురిని రేవంత్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసేవారికి పార్టీ గుర్తింపు ఇస్తోందన్నారు.
హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్ టికెట్ అడగలేదన్నారు. కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాడని గుర్తించి బల్మూరి వెంకట్కు హుజూరాబాద్ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టికెట్ల కోసం పార్టీలో పైరవీలుండవన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారి ఇంటికే టికెట్ తీసుకొచ్చి ఇస్తానని రేవంత్ పునరుద్ఘాటించారు. ప్రతి నిరుద్యోగ యువకుడికి ప్రభుత్వం బకాఇ ఉందని ఆయన చెప్పారు. మహబూబ్నగర్లో నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహి స్తామని చెప్పారు. శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ ఉద్యమిస్తుందని రేవంత్ చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహా, మల్లు రవి, మల్రెడ్డి రాంరెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి తదితరులు ఉన్నారు.